మెదక్, జూలై 4 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రజావాణికి వస్తున్న ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత వారం ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు మళ్లీ రాకుండా చూడాలని సూచించారు. ప్రజావాణిలో పదకొండు దరఖాస్తులు వచ్చాయని, అందులో ఆరు విజ్ఞప్తులు భూ సమస్యలకు సంబంధించినవి కాగా, మిగతా 5 ఫిర్యాదులు వివిధ అంశాలకు సంబంధించినవని తెలిపారు. వాటిని సంబంధిత శాఖాధికారులకు అందజేస్తూ పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా మెదక్ మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన సలావత్ దుర్గ్యా కోరిన వెంటనే జిల్లా సంక్షేమాధికారి బ్రహ్మాజీని పిలిచి నూతన ట్రై సైకిల్ను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, డీఎస్వో శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై వేగంగా స్పందించండి:సంగారెడ్డి కలెక్టర్ శరత్ నాయక్
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్స్ సమావేశ మందిరంలో శాఖల వారీగా 5 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. శాఖల వారీగా వచ్చిన బాధితుల ఫిర్యాదుల్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం వచ్చిన వివిధ సమస్యలపై 133 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వేగంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని కలెక్టర్ అన్నారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.