సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 30: మన ఊరు-మన బడి కింద అనుమతి పొందిన పాఠశాలల పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో మన ఊరు మన బడి పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు మన బడి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషషయని అన్నారు. ఆయా పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 15లోగా పనులను పూర్తి చేయాలన్నారు. నాణ్యతలో ఇంజినీరింగ్ అధికారులు పూర్తి శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పనుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసుల్లో న్యాయం చేయాలి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వేగవంతంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అట్రాసిటీ కేసులు జరగకుండా ఉండేందుకే జాగృతంగా ఉండాలన్నదే ఈ కమిటీ ఉద్దేశమన్నారు.
2020 నుంచి 2022 వరకు జిల్లాలో 130 అట్రాసిటీ కేసుల్లో బాధితులకు రూ.1,50,49,500 ఎక్స్గ్రేషియా ఇప్పించామని కలెక్టర్ తెలిపారు. ప్రతి నెలా పౌర హక్కుల దినాన్ని నిర్వహించాలని సూచించారు. అనంతరం ఎస్పీ రమణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకునేటప్పుడు బాధితులకు సరైన రీతిలో సమగ్రంగా అన్ని అంశాలతో ఫిర్యాదు చేసేలా కమిటీ సభ్యులు సహకారం అందించాలన్నారు. అనంతరం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి నామినేట్ అయిన సభ్యులకు సన్మానించారు. సమావేశంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డీడీ అఖిలేశ్రెడ్డి, డీఎస్పీలు, రెవెన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.