సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 28 : ఉపాధి హామీ పథకంలో వందశాతం లక్ష్యాన్ని సాధించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఎంపీడీవో, ఎంపీవోలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎంపీడీవో, ఎంపీవోల సమావేశంలో కలెక్టర్ హాజరై మాట్లాడారు. జూలై 20లోగా జిల్లాలో అన్ని పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. హరితహారంలో జిల్లాలో కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. 15రోజుల్లోగా మొక్కలు నాటేందుకు గుంతలు తీయాలని సూచించారు. ప్రణాళికాబద్ధ్దంగా ఎవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు.
అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. వచ్చేనెల 28లోగా పల్లె ప్రకృతి వనాలు వందశాతం పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఒక ఎకరంలో స్థలంలో ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పంచాయతీల్లో తడి చెత్తతో కంపోస్టు ఎరువులు తయారు చేయాలన్నారు. డంపింగ్యార్డులు పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. వచ్చేనెల లోగా ఉపాధి హామీ పనుల లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. ప్రతిచోటా వర్క్బోర్డు విధిగా ఉండాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షిషా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్రావు, డీపీవో సురేశ్ మోహన్ సిబ్బంది పాల్గొన్నారు.