పెద్దశంకరంపేట, జూన్27: వారం రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో పొలంలో పడి ఉన్న మహిళ మృతదేహం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. సోమవారం పెద్దశంకరంపేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ తెలిపారు. పెద్దశంకరంపేట మండలంలోని శివాయపల్లికి చెందిన కుక్కల లక్ష్మి (38) మానసిక దివ్యాంగురాలు. ఈ నెల 16న శివాయపల్లి శివారులోని ఒక టీస్టాల్ వద్ద ఉన్న గుడిసెలో లక్ష్మి కూర్చొని ఉంది. సమీప రైస్మిల్లో పని చేస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వలస కూలీలు సీహెచ్.ముఖియా, సంజిత్ రిశిదేవ్ మద్యం సేవించి మహిళ వెంటపడ్డారు. గుడిసెలో లక్ష్మిని చూసి మొదటగా ముఖియా లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. కాగా ఆమె ప్రతిఘటించి, అక్కడి నుంచి బయటికొచ్చి శివాయపల్లి గ్రామం వైపు నడుచుకుంటూ వెళ్లిపోయింది. నిందితులిద్దరూ మృతురాలిని అనుసరించి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేశారు.
ఈ విషయాన్ని ఆమె ఎవరికైనా చెబితే దొరికిపోతామనే భయంతో లక్ష్మిని అక్కడే హత్య చేశారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి పొలంలో పూడ్చిపెట్టారు. ఈ నెల 21న వర్షం కురవడంతో మహిళ మృతదేహం కాలు, చేయి పైకి తేలింది. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారం రోజుల్లోనే కేసును ఛేదించారు. కేసు విచారణలో కీలక పోత్ర పోషించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, బంధువులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి, ఏమైనా సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వారం రోజుల్లోనే పోలీసులు ఛేదించడంతో సీసీ ఎస్సై, పోలీసులకు ఎస్పీ రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం, మెదక్ రూరల్ సీఐలు జార్జ్, విజయ్కుమార్, పేట, రేగోడ్, టేక్మాల్, అల్లాదుర్గం ఎస్సైలు బాలరాజు, సత్యనారాయణ, లింగం, రవీందర్, సీసీ ఎస్సై గోపినాథ్ తదితరులున్నారు.