వెల్దుర్తి, జూన్ 25. ఆధునిక పద్ధతుల్లో, యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. వెల్దుర్తిలోని ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఎంపీపీ స్వరూప అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి వెల్దుర్తి మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమని, అధిక మొత్తం లో పంటలను సాగు చేస్తున్నారని చెప్పారు.
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా చూడాలని, ఇతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అయిల్పామ్ సాగుతో రైతులకు అధిక దిగుబడి సాధించవచ్చునని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పూర్తిస్థాయిలో వ్యవసాయ అధికారులను నియమించి వ్యవసాయాభివృద్ధ్దికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సందర్భంగా వెల్దుర్తి, పీహెచ్సీ డాక్టర్ బాపురెడ్డి శాఖ నివేదికను వెల్లడించడంలో ఇబ్బందిపడగా, అతడి తీరుపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగు పర్చుకోవాలన్నారు. సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, పీహెచ్సీ పరిధిలో ఉన్న సమస్యలు, శాఖ పూర్తిస్థాయి నివేదికను రెండు రోజుల్లో ఎమ్మెల్యేకు అందించాలని ఆదేశించారు.
మన ఊరు- మన బడిలో భాగంగా మండలంలో 12 పాఠశాలలో ఎంపికయ్యాయని, వాటి లో పలు పాఠశాలలకు నిధులు రాగా, పనులు ప్రారంభమయ్యాయని ఎంఈవో యాదగిరి తెలిపారు. విద్యుత్ సమస్యలపై పలువురు ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకురాగా, స్పందించిన ఎంపీ గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి సమస్యల ఆధారంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఈ సమావేశంలో తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, జడ్పీటీసీ రమేశ్ గౌడ్, వెల్దుర్తి, మాసాయిపేట తహసీల్దార్లు సురేశ్, మాలతి, ఎంపీడీవో జగదీశ్వరా చారి, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.
దళితబంధుతో కుటుంబాల్లో వెలుగులు
దళితుల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపట్టిన దళితబంధు పథకం దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మాసాయిపేట మండల పరిధిలోని రామంతాపూర్కు చెందిన ఐదుగురు దళితబంధు లబ్ధిదారులకు వాహనాలను ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి అందజేశారు. దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తూ అన్ని వర్గాల అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్ గౌడ్, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు భూపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వెల్దుర్తి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్రెడ్డి, నాయకులు నరేందర్రెడ్డి, ఆంజనేయులు, ప్రతాప్ రెడ్డి, అశోక్గౌడ్, వేణు గోపాల్రెడ్డి, రమేశ్ చందర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.