నారాయణఖేడ్, జూన్ 23: ఉద్యోగాలు సాధించాలనే యువతీ యువకులు తమకు అవసరమైన శిక్షణ కోసం హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి. అభ్యర్థుల ఇబ్బందులను దూరం చేసే దిశగా ప్రభుత్వ పెద్దల సూచన మేరకు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నారాయణఖేడ్లోనే శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 75 రోజుల పాటు రాత పరీక్షకు సంబంధించిన కోచింగ్ కొనసాగిస్తున్నారు. కోచింగ్ ముగిసిన అనంతరం పోలీస్ ఉద్యోగాలకు అవసరమైన శారీరక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. పోటీతత్వం పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ముందుకొచ్చారు. దీంతో ఉద్యోగార్థులను గట్టెక్కించి ప్రభుత్వ ఉద్యోగం పొందేలా ప్రోత్సహించేందుకు ఎంబీఆర్ ఫౌండేషన్ ద్వారా నడుంబిగించారు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి.
కోచింగ్ సెంటర్లకు దీటుగా..
హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లకు దీటుగా జూక్కల్ శివారులోని ప్రభుత్వ ఆడిటోరియంలో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటుచేశారు. పేరుమోసిన శిక్షణా సంస్థల బోధనా సిబ్బందితో 13 సబ్జెక్టులు బోధిస్తున్నారు. దాదాపు 500 మంది యువతీ యువకులు శిక్షణా కేంద్రానికి హాజరవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు ఉద్యోగార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. శిక్షణానంతరం ఓ ప్రసిద్ధ కోచింగ్ సెంటర్ రూపొందించిన స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందజేయనున్నారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం సంసిద్ధులవుతున్న యువతీ యువకులకు శారీరక శిక్షణ ఇచ్చేందుకు స్థానిక పోలీస్ అధికారుల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
జీవితాన్నే మారుస్తుంది
పేద కుటుంబంలోని ఒక్కరికీ ఉద్యోగం వస్తే ఆ కుటుంబ జీవన స్థితిగతులు మా రిపోతాయి. ఎలాంటి వసతులు అందుబాటులో లేని నారాయణఖేడ్ ప్రాంతం లో యువతీ యువకులు ఉద్యోగాల సాధనలో పడే ఇబ్బందులు గుర్తించి వారి కోసం ఎంబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాం. పేదల కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు, శిక్షణ పొందిన వారు ఉద్యోగాలు సాధిస్తే అదే నాకు సంతృప్తి. ఉద్యోగార్థులతో నేను నేరుగా మాట్లాడినప్పుడు వారి మాటల్లో నాకు ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది. శిక్షణ పొందిన వారిలో అత్యధికశాతం మంది ఉద్యోగాలు సాధిస్తారనే నమ్మకం ఉంది.
– మహారెడ్డి భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే, నారాయణఖేడ్
సువర్ణావకాశం
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి చొరువతో ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతీ యువకులకు ఇదో సువర్ణావకాశం. ఎమ్మెల్యే ఖర్చుకు వెనుకాడకుండా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం ఉద్యోగార్థుల అదృష్టం. కోచింగ్ సెంటర్ నిర్వహణ బాధ్యతలు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ మూడ రాంచందర్ ఆధ్వర్యంలో నాతో సహా తుకారాం, లక్ష్మణ్ చూస్తున్నారు. ఎమ్మెల్యే కల్పించిన వసతులపై ఉద్యోగార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – అంజాగౌడ్, టీఆర్ఎస్వీ
డివిజన్ అధ్యక్షుడు, నారాయణఖేడ్
ఎమ్మెల్యే మేలు మరువం
మాది సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామం. నేను గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నా. మా ఇబ్బందులు గుర్తించి పెద్ద మొత్తంలో ఖర్చు చేసి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, మధ్యా హ్న భోజనం పెట్టి, స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తున్న ఎ మ్మెల్యే భూపాల్రెడ్డి సార్ మేలు మరువం. మాకు అర్థమయ్యే రీతిలో అన్ని సబ్జెక్టులు బాగా బోధిస్తున్నారు. నేను తప్పనిసరిగా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం వచ్చింది. ఉద్యోగం సాధించి ఎమ్మెల్యేకు, నా తల్లిదండ్రులకు పేరు తీసుకొస్తా.
– అమ్రీన్, ఖాజాపూర్, సిర్గాపూర్ మండలం
నిరుద్యోగులకు మేలు జరిగింది
ఎమ్మెల్యే సార్ ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్తో నిరుద్యోగ యువతీ యువకులకు మేలు జరిగింది. హైదరాబాద్లోని ప్రముఖ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకోవాలంటే కనీసం రూ.50 వేలు ఖర్చవుతుంది. అంత ఖర్చును భరించే స్థోమత లేదు. ఎమ్మెల్యే సార్ నారాయణఖేడ్లో కోచింగ్ సెంటర్తో పాటు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి స్టడీ మెటీరియల్ కూడా అందజేసి ఆదుకున్నారు. ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి నిరుద్యోగుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నా.
– సునీల్, చుక్కల్తీర్థ్, కంగ్టి మండలం