సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 21: జిల్లాలో ‘మనఊరు-మనబడి’ కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు వేగవంతంగా చేయాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసమే ఈ పథకం పనులు నాణ్యతగా చేయాలని ఆదేశించారు. ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యాన్ని వహించినా సహించేది లేదని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ‘మనఊరు-మనబడి’ పనుల పురోగతిపై విద్యాశాఖ అధికారులు, సంబంధిత ఇంజినీరింగ్ ఏజెన్సీలతో కలెక్టర్ సమీక్షించారు.
ఏజెన్సీల వారీగా చేపట్టిన పనులు, పరిపాలన, సాంకేతిక అనుమతులు, కేటగిరీ వారీగా పనులు, ఈజీఎస్ కింద చేపట్టిన పనులు, ఖర్చు, అంచనాలు, పూర్తైన పనులు, రూ.30 లక్షలలోపు పనులు, రూ.30లక్షలకు పైబడిన పనుల పురోగతి తదితర వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని పేర్కొన్నారు. జిల్లాలో మొదటి విడుత కింద ఎంపికైన 441 పాఠశాలల్లో పనులు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, జాప్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పూర్తి చేసిన పనులకు కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు డబ్బు చెల్లించాలన్నారు. ఈజీఎస్లో ఎస్టిమేషన్ జనరేట్ చేసి పనులు పూర్తి చేయాలని సూచించారు.
వారంలోగా ఈజీఎస్ కింద చేపట్టిన పనుల గ్రౌండింగ్ పూర్తి కావాలన్నారు. మంజూరైన ఆయా పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో కొనసాగుతున్న ‘మనఊరు-మనబడి’ పనుల పురోగతిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు ఏజెన్సీల వెంటపడి పనులు నాణ్యతగా చేయించుకోవాలని సూచించారు. నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగమయ్యేలా పర్యవేక్షణ జరగాలన్నారు. అన్ని ప్రాజెక్టులకు పరిపాలన, టెక్నికల్ మంజూరు కావాలన్నారు. పనులు ముందు చేసిన వారికి ముందుగా డబ్బులు వస్తాయని స్పష్టం చేశారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. ఈ నెల 30న నిర్వహించే సమావేశం నాటికి 90శాతం పనులు పూర్తి కావాలని కలెక్టర్ సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఈవో నాంపల్లి రాజేశ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, టీఎస్ డబ్ల్యూఐడీసీ శాఖల అధికారులు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.