చిలిపిచెడ్, జూన్ 19 : మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులో చాముండేశ్వరీ ఆలయంలో భక్తులు సందడి నెల కొన్నది. ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం సమీపంలోని మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి కుంకుమార్చన, ఒడిబియ్యం సమర్పించారు. ప్రధాన పూజరి ప్రభాకరశర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఆలయంలో అన్నదానం నిర్వహించారు.
కొయ్యగుట్ట మల్లన్నకు భక్తుల పూజలు
మెదక్రూరల్, జూన్ 19 : మెదక్ మండలంలోని మం బోజిపల్లి శివారులోని కొయ్యగుట్టపై కొలువుదీరిన మల్లికార్జునస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. పూజారి మల్లన్న మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు మంగళ హారుతులతో ఒడిబియ్యం సమర్పించారు. పద్మ, కృష్ణంరాజ్ భక్తులు ఆలయానికి ఫ్యాన్లు అందజేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.
కిక్కిరిసిన తునికి నల్లపోచమ్మ ఆలయం
కౌడిపల్లి, జూన్ 19 : మండలంలోని తునికి గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో వెలిసిన నల్లపోచమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన పూజారి శివప్ప అమ్మవారిని ప్రత్యే కంగా అలంకరించారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు.
వేంకటేశ్వరాలయంలో ఉత్సవాలు
రామాయంపేట, జూన్ 19 : పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మీపతి, పూజారి వెంకన్న, కమిటీ సభ్యులు కొవ్వూరి లక్ష్మణ్, రవీందర్, సంతోశ్, కిరణ్ తదితరులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, మంగళహారతులు సమర్పించారు.