మెదక్, మే 31 (నమస్తే తెలంగాణ): టీఎస్ఐపాస్ విధి విధానాలు, మార్గదర్శకాలకనుగుణంగా పరిశ్రమలు నెలకొల్పుటకు పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ కింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల్లో 14దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రధానంగా కర్మాగారాలు, డీటీసీపీ, గ్రౌండ్ వాటర్, నీటి పారుదల, రెవెన్యూ శాఖల్లో క్లియరెన్స్, ఆమోదం నిమిత్తం పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులోగా క్లియరెన్స్ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా టీ-ఫ్రైడ్ కార్యక్రమం కింద కూచారంలో ఎస్టీ లబ్ధిదారుడు బొగ్గు, ఎథనాల్కు సంబంధించి ఉత్పాదకత పరిశ్రమ ఏర్పాటుకు సబ్సిడీ అందజేయుటకు కమిటీ ఆమోదించింది. అలాగే టీ-ఫ్రైడ్ కింద 65మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 35 శాతం సబ్సిడీతో రూ. 2కోట్ల విలువ గల వాణిజ్య వాహనాలు లబ్ధిదారులకు అందించుటకు కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో 15ఎస్సీలకు సంబంధించి రూ. 42లక్షలు, 50మంది ఎస్టీలకు రూ. కోటి 48లక్షల విలువ గల వాణిజ్య వాహనాలు అందించనున్నారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా పరిశ్రమ ల అధికారి కృష్ణమూర్తి, ఎలక్ట్రిసిటీ డైరెక్టర్ రాంబాబు, టీఎస్ఎస్ఐఐసీ ఈవో తుక్యానాయక్, జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి వేణుగోపాల్రావు, హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారి నీలి మ, గ్రౌండ్ వా టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ప్రతినిధులు పాల్గొన్నారు.
బడిబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
మెదక్ మున్సిపాలిటీ, మే 31: వివిధ శాఖల అధికారు లు సమన్వయంతో పనిచేసి బడిబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా ఆదనపు కలెక్టర్ రమేశ్ సూ చించారు. బడిబాట సన్నాహక కార్యక్రమంలో భాగంగా మంగళవారం సమావేశంలో మాట్లాడుతూ పాఠశాల వయస్సు పిల్లలను గుర్తించి వారిని సమీప పాఠశాలలో చేర్పించాలన్నారు. ఇటుక బట్టి, పరిశ్రమలు, దుకాణాలు తదితర వాటి పనుల్లో ఉన్న బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలలకు తిరిగి తీసుకొచ్చేందుకు కార్మికశాఖ, పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో ముందుకెళ్లలన్నారు.
ఒకటో తరగతిలో చేరవలసిన విద్యార్థులను అంగన్వాడీ కార్యకర్తలు గుర్తించి సమీప పాఠశాలల్లో స్వయంగా చేర్పించాలని సూచించారు. 5వ తరగతి, 7వ తరగతి పూర్తి చేసుకున్న తరువాత తరగతుల్లో చేరే విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా చూడలన్నారు. బడి బయటి పిల్లలను బడుల్లో చేర్చేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. మండల స్థాయిలో, పాఠశాల స్థాయిలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో బడిబాట సన్నాహక సమావేశాలు నిర్వహించాలని రమేశ్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖధికారి రమేశ్ కుమార్, ఎస్సీ సంక్షేమధికారి విజయలక్ష్మి, మైనారిటీ సంక్షేమధికారి జెమ్లానాయక్, యునిసెఫ్ కో-ఆర్డినేటర్ గంగాధర్, వివిధ మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ అధికారులు, ఎంఈవోలు పాల్గొన్నారు.