గుమ్మడిదల, మే 25: అడవుల రక్షణతో పాటు వాటిలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణకు సాసర్పిట్లలో నీరు పెడుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు అటవీశాఖ అధికారులు. మండుటెండల్లో వన్యప్రాణుల దాహం తీర్చుకోవడానికి రోడ్లుపైకి వచ్చి వాహనాల బారిన పడి మృత్యువాత పడకుండా అడవిలో ఉన్న సాసర్ పిట్లలో వారంలో రెండు సార్లు ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీరు పెడుతూ వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నారు. గుమ్మడిదల మండలంలో నల్లవల్లి, మంబాపూర్, గుమ్మడిదల, కానుకుంట, బొంతపల్లి గ్రామాల పరిధిలో రెండున్నర వేల ఎకరాల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి.
ఇందులో చిరుతలు, జింకలు, దుప్పిళ్లు, కుందేళ్లు, అడవి పందులు, కోతులు, నక్కలు, అడవి కుక్కలు, ఏదులు, మనుబోతులు, చుక్కల దుప్పిళ్లు, తోడేళ్లు,రకరకాల పక్షులు, నెమళ్లు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. అడవులను,వన్యప్రాణులను సంరక్షించడానికి కందకాలు, పెన్సింగ్లు, అడవిచుట్టూ ఫైర్లైన్లు ఏర్పాటు చేశారు. అడవుల పచ్చదనంతో పాటు పక్షుల కిలకిలరాగాలు ఆహ్లాదపరుస్తాయి. వానకాలంలో వానలకు వాగు వంకలో ఉన్న నీటితో వన్యప్రాణులు దాహం తీర్చుకుంటాయి. కానీ, వేసవికాలంలో వాగుల్లో, వంకలో నీరు ఎండిపోవడంతో వాటి దాహం తీర్చడానికి అటవీ శాఖ అధికారులు గతంలో 36 సాసర్ పిట్లు, చెక్డ్యాంలు ఏర్పాటు చేశారు. ఈ వేసవిలో ఎండలు దంచికొడుతుండడంతో వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా వారంలో రెండు సార్లు నీరు పెడుతు వాటి దాహార్తిని తీరుస్తున్నారు. పగలు కోతులు, నెమళ్లు, కుందేళ్లు, పందులు దాహం తీర్చుకుంటాయి.
రాత్రి వేళలలో చిరుతలు తదితర జంతువులు దాహం తీర్చుకోవడానికి సాసర్ పిట్ల వద్దకు వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. వీటితో పాటు వేసవికాలంలో అటవీ సంపదను కొల్లగొట్టే అక్రమ కలప వ్యాపారులను కట్టడి చేయడానికి నిఘా పెడుతున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. కందకాలను తవ్వించారు. అడవి చుట్టూ ఫైర్ లైన్లు, ప్రహరీ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అటవీ సంపదను రక్షిస్తున్నారు. బీట్ రూట్ అధికారులు నిత్యం నిఘా పెడుతున్నారు. రాత్రి వేళలో వన్యప్రాణులను వేటగాళ్లు వేటాడకుండా గట్టి బందోబస్తు చేస్తున్నామని తెలిపారు. వన్యప్రాణులను, అటవీ సంపదను కొల్లగొట్టేవారికి చట్టపరపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి కృషి
గుమ్మడిదల మండలంతో పాటు మంభాపూర్, నల్లవల్లి, గుమ్మడిదల అటవీ ప్రాంతంలో 36 సాసర్ పిట్లు మరియు చెక్డ్యాంలు ఉన్నాయి. వేసవికాలంలో వన్యప్రాణుల దాహం తీర్చుకోవడానికి నీరు లేక పోవడంతో ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా వారంలో రెండు సార్లు సాసర్పిట్లలో నీళ్లు పోస్తున్నాము. దీని వల్ల అడవుల్లో ఉన్న ప్రాణులు దూప తీర్చుకుంటున్నాయి. అలాగే హరితహారంలో భాగంగా అడవుల్లో ఖాలీగా ఉన్న ప్రాంతాల్లో మొక్కలను నాటుతున్నాము. నాటిన మొక్కలకు నీరు పెడుతూ అటవి సంపదను రక్షిస్తున్నాము. అక్రమకలప వ్యాపారులకు, వేటగాళ్లపై నిఘా పెడుతున్నాము. అడవులు సంరక్షణ కోసం అడవి రోడ్లకు ఇరువైపుల బోర్డులు పెట్టించాము.
-ఏ.వీరేంద్రబాబు, జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ , సంగారెడ్డి జిల్లా