నిజాంపేట, మే25: మండల కేంద్రంలో నిర్మించిన అభయాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో అభయ ఆంజనేయ స్వామి, విజయ గణపతి, నాగేంద్రస్వామి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని మాజీ సర్పంచ్ వడ్ల తిరుమలయ్య కృషితో నిర్మించారు. భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొమ్మాట బాబు, పీఏసీఎస్ డైరెక్టర్ ఎర్రెల్లయ్య, గ్రామస్తులు పంజా మహేందర్, జిట్టి మారుతి, నరేందర్, మహేశ్, గర్గుల సుధాకర్, భూమగౌడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్లో
మెదక్ మున్సిపాలిటీ, మే 25: జిల్లా కేంద్రంలోని హనుమన్ ఆలయాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామికి పంచామృతాభిషేకం, మహాదివ్య అలంకరణ, మహా మంగళ హారతి, హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం, పూజలు చేశారు. పంచముఖి ఆలయంలో ఆలయ వంశానుగత కర్త మధుసూదన్చారి ఆధ్వర్యంలో ఘనంగా హోమం నిర్వహించారు. కట్టకింది వీర హనుమన్ ఆలంయంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, రిటైర్డు జాయింట్ కలెక్టర్ పోద్దార్ సురేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్రావు, కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్, నాయకులు లింగారెడ్డి, చింతల నర్సింలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు.
సీసీ కెమెరాల విరాళం
నర్సాపూర్, మే25: మండలంలోని పెద్దచింతకుంట గ్రా మ సమీపంలోని జల హనుమాన్ ఆలయంలో ఆంజనేయస్వామి జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి ఉత్సవాలు సర్పంచ్ శివకుమార్, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి పంచామృత అభిషేకం, చందన లేపనం, రకరకాల పూలతో అలంకరణ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. హైదరాబాద్లోని మలక్పేట్ ప్రాంతానికి చెందిన జగుల్ కిశోర్ అగర్వాల్, దుర్గాదేవి అగర్వాల్లు పెద్దచింతకుంటలోని జల హనుమాన్ ఆలయానికి 80 వేల విలువ చేసే సీసీ కెమెరాలు అందజేశారు. సర్పంచ్ శివకుమార్ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
కొల్చారంలో..
కొల్చారం, మే 25: మండలంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రంగంపేటలో హనుమాన్ మందిర్లో మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శోభాయాత్ర నిర్వహించారు.
చేగుంట మండలంలో..
చేగుంట,మే25: హనుమాన్ జయంతిని పురష్కరించుకుని మండలంలోని పలు గ్రామాల్లో వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని పొలంపల్లి, చిన్నశివునూర్ గ్రామాల్లో ఆంజనేయ స్వామికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, తమలపాకుల పూజ, హోమం, పూర్ణాహుతి, మహాహారతి, తీర్థ ప్రసాద వితరణ, అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఆర్చకుడు సంగమేశ్వరశర్మ, సర్పంచ్ కొటారి అశోక్, ఉప సర్పంచ్ పాక స్వామి, స్వామిగౌడ్, సిద్దిరాములు, యెన్నెలి సత్యం, భక్తులు పాల్తొన్నారు.