మెదక్, మే 24 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా గూడులేని నిరుపేదలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించుకున్న పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేసింది. ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మెదక్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మండలానికో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభు త్వం విడుదల చేసిన క్రమబద్ధీకరణ జీవో 58 కింద 125 చదరపు గజాల్లోపు ఆక్రమించుకుని ఇండ్లు నిర్మించుకున్న వారిని గుర్తించి పట్టాలు అందజేయనున్నది. ప్రత్యేక బృం దాల ద్వారా అర్హులను గుర్తించిన వెంటనే ఆర్డీవోలు పరిశీలించి జిల్లా కలెక్టర్కు నివేదికలు అందజేస్తారు. అర్హుల గు ర్తింపును వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
552 దరఖాస్తులు… నాలుగు బృందాలు…
ప్రభుత్వ స్థలాల్లో కొన్నేళ్ల క్రితం ఇండ్లు నిర్మించుకున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించేందుకుగానూ దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించిన ప్రభుత్వం 58,59 జీవోలు విడుదల చేసింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 552 మంది దరఖాస్తులు అందజేశారు. వీటి పరిశీలనకు జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ నాలుగు ప్రత్యేక బృందాలను నియమించారు. ఒకటో బృందంలో మెదక్ మండలంలో 149 దరఖాస్తులు, పాపన్నపేట మండలంలో 36, పెద్దశంకరంపేట మండలంలో 24, హవేళీఘనపూర్ మండలంలో 8 మొత్తం 217 దరఖాస్తులకుగానూ నియమించిన బృందంలో డీఆర్డీవో శ్రీనివాస్తో పాటు నాయబ్ తహసీల్దార్ నవీన్కుమార్, ముగ్గురు గిర్దావర్లు ఉన్నారు. అలాగే రెండో బృందంలో నిజాంపేట మండలంలో ఒక దరఖాస్తు రాగా, చిన్నశంకరంపేట మండలంలో 17, అల్లాదుర్గంలో 16, రేగోడ్లో ఒక దరఖాస్తు మొత్తం 35 దరఖాస్తులకుగానూ అడిషనల్ డీఆర్డీవో బీమయ్యతో పాటు నాయబ్ తహసీల్దార్ రాజేశ్వర్తో పాటు ముగ్గురు గిర్దావర్లు బృందంలో ఉన్నారు.
అలాగే మూడో బృందంలో నర్సాపూర్ మండలంలో 233, కొల్చారంలో 3, కౌడిపల్లిలో 2, చిలిపిచెడ్లో ఒక దరఖాస్తురాగా, మొత్తం 239 దరఖాస్తులకు మైనింగ్శాఖ ఏడీ జయరాజ్తో నాయబ్ తహసీల్దార్లు ఆదర్శకుమార్, నవీన్, కిశోక్కుమార్, తారాబాయ్ ఉన్నారు. నాలుగో బృందంలో చేగుంట మండలంలో 4, నార్సింగి మండలంలో ఒకటి , మనోహరాబాద్ మండలంలో 10, మాసాయిపేట మండలంలో 5, తూప్రాన్ మండలంలో 41 దరఖాస్తులురాగా మొత్తం 61 దరఖాస్తులకుగానూ పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తితో పాటు ఐదుగురు రెవెన్యూ అధికారులు బృందంలో ఉన్నారు. వీరు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలను యాప్లో నమోదు చేసి అన్నీ సవ్యంగా ఉంటే క్రమబద్ధీకరణపై సానుకూల నిర్ణయం తీసుకుంటారు.
ఇండ్లు నిర్మించుకున్న వారికి యాజమాన్య హక్కులు
నిరుపేదల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభు త్వం మరోసారి తనకుతానే సాటిగా నిరూపించుకున్నది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వీటి క్రమబద్ధీకరణకు 2014 డిసెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల చేసింది. వీటిని దశలవారీగా పొడిగిస్తూ పేదలకు అవకాశం కల్పించింది. జీవో 58 ప్రకారం 125 చదరపు గజాల్లోపు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు ఆమోదించింది. అంతేకాకుండా జీవో 59 ప్రకారం మధ్యతరగతి, ఆపై తరగతికి చెందిన ప్రజలు నిర్మించుకున్న ఇండ్ల విస్తీర్ణం ఆధారంగా ధరలను కూడా ఖరారు చేసింది. 125 చదరపు గజాల నుంచి 250 చదరపు గజాల వరకు 50 శాతం చెల్లిస్తే చాలని, 250 చదరపు గజాల నుంచి 500 చదరపు గజాల్లోపు వాటికి బేసిక్ మార్కెట్ విలువలో 75 శాతం చెల్లించాలని, 500 చదరపు గజాలకు మించిన స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి 100 శాతం మార్కెట్ విలువ వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు దశలవారీగా చెల్లింపులకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది.
నాలుగు బృందాలను నియమించాం
మెదక్ జిల్లాలో క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు నాలుగు బృందాలను నియమించాం. ఒక్కో బృందంలో ఒక జిల్లా అధికారితో పాటు మరో నలుగురు రెవెన్యూ నాయబ్ తహసీల్దార్లు ఉంటారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. జిల్లా వ్యాప్తంగా 552 దరఖాస్తులు వచ్చాయి. 2016కు ముందు నిబంధనల మేరకు ఆయా స్థలాల్లో ఉంటున్న వారి దరఖాస్తులను పరిశీలించి మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన క్రమబద్ధీకరణ జీవో 58 కింద 125 చదరపు గజాల్లోపు ఆక్రమించుకుని ఇండ్లు నిర్మించుకున్న వారిని గుర్తించి పట్టాలు అందజేస్తాం.
-ఎస్.హరీశ్, మెదక్ జిల్లా కలెక్టర్