రామయంపేట, మే 21: ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామాయంపేట పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై రాజేశ్ కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన పెద్దపొట్టి మల్లేశం కూమార్తె శ్రావణి(17) ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రాసింది. తర్వాత తన సొంతూరు బాగిర్తిపల్లికి చేరుకున్నది. ఇంట్లోకి రాగానే తన సెల్ఫోన్ కావాలని తల్లిని కోరింది. నిన్ననే పరీక్షలు అయిపోయాయి.. కొద్దిరోజుల తర్వాత ఇస్తానని తల్లి చెప్పింది. దీంతో మిన్నకుండిన మృతురాలు శ్రావణి మనస్తాపానికి గురై శుక్రవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. గ్రామానికి పక్కనే ఉన్న మెదక్ జిల్లా రామాయం పేట మండలం కోనాపూర్ చెరువులో శనివారం మృతదేహంగా కనిపించింది. శ్రావణి ఇంట్లో నుంచి వెళ్లినప్పటి నుంచి వారి బంధువుల వద్ద ఇతర ప్రదేశాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. కొంతమంది గ్రామస్తులు కోనాపూర్ చెరువులో ఆడపిల్ల మృతదేహం ఉందని తెలిపారు.
వెంటనే కుటుంబీకులు, బంధువులు అక్కడకు చేరుకుని చెరువులో తెలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీశారు. శ్రావణిగా గుర్తించి బోరుమన్నారు. విషయం తెలుసుకున్న రామాయంపేట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పంచనామా చేసి, పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇది హత్య చేసి చెరువులో పడేసారని బంధువులు, గ్రామస్తులు ఆరోపించారు. మృతురాలి సెల్ఫోన్ చూడగా అందులో ఇద్దరు యువకులు కొన్ని రోజులుగా వేధింపులకు పాల్పడుతూ అసభ్య పదజాలం, వెకిలి చిత్రాలను వాట్సాప్లో పంపినట్లు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను ఇక్కడికి పిలిపించాలని కుటుంబీకులు రోడ్డుపై బైఠాయించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై రాజేశ్ తెలిపారు.