చౌటకూర్, మే 20 : భారత ప్రభుత్వ యోజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో మండల పరిధిలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూలో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ సమైక్యతా శిబిరాలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగానే ఈ శిబిరాలకు దేశంలోని 10 రాష్ర్టాల నుంచి 200 మంది విద్యార్థి వలంటీర్లు పాల్గొని శ్రమదానం, యోగా ప్రాంతీయ కళానృత్యాలు, ఆటపాటలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. వారం రోజులుగా కొనసాగిన కళానృత్యాల్లో విద్యార్థులు ప్రదర్శించిన బోనాల జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో వలంటీర్లకు వివిధ ఔషధ మొక్కల పెంపకం, వాటి అవసరం, ఉపయోగాలపై, జీవన నైపుణ్యాలు, వ్యక్తిగత బంధాలు, యువత సాధికారిత, జాతీయ సేవా పథకంపై ఎన్ఎస్ఎస్ ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ రెక్టార్ ఎ. గోవర్ధన్. జేఎన్టీహెచ్ గౌరవ అతిథి ఓఎస్డీ ధర్మానాయక్ హాజరయ్యారు. జాతీయ సమైక్యతా శిబిరాలు సుల్తాన్పూర్ జేఎన్టీయూ కళాశాలలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎన్ నివాస్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సమాజసేవ ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఎన్ఎస్ఎస్ డైరెక్టర్ రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.శోభారాణి, వైస్ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ జి. నర్సింహా, కళాశాల ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్లు రాంనరేశ్ యాదవ్, ప్రొఫెసర్ దిలీప్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.