పటాన్చెరు టౌన్/ పటాన్చెరు, మే18 : తెలంగాణ ప్రభుత్వం వేసిన పోలీస్ ఉద్యోగాల ప్రకటన నిరుద్యోగుల్లో జోష్ నింపింది. పోలీసు శాఖలోనే 16,027 పోస్టుల భర్తీ ప్రకటన రావడంతో అభ్యర్థులంతా శిక్షణ తీసుకునేందుకు పరుగులు తీస్తున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో పటాన్చెరులో ప్రారంభించిన ఉచిత శిక్షణ శిబిరం అభ్యర్థుల్లో మరింత ఆనందాన్ని నింపింది.
492 మందికి శిక్షణ
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి త్వరలో వస్తున్న పలు శాఖల కొలువుల భర్తీ కోసం శిక్షణ శిబిరాన్ని ఏర్పాటుచేశారు. పోలీసు శాఖతో కలిసి ఇస్తున్న ఈ శిక్షణా శిబిరంలో 492 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇందులో 381 మంది యువకులు, 111 మంది యువతులు ఎంపికయ్యారు. ప్రముఖ కోచింగ్ ఇనిస్టిట్యూట్ గోపీ అకాడమీ సహకారంతో జరుగుతున్న క్లాసులకు అభ్యర్థులు హాజరవుతున్నారు. గతంలో ఇలాంటి శిబిరంలో వారిలో 263 మంది ఉద్యోగాలు సాధించడంతో ఈసారి భారీగా స్పందన వచ్చింది. పరీక్షలు రాసిన ముగ్గురిలో ఇద్దరు జాబ్స్ సంపాదించడంతో యువతలో ఈ క్యాంప్పై మరింత ఆసక్తి పెరిగింది.
అన్ని రకాల పోస్టులకు శిక్షణ
కానిస్టేబుల్తో పాటు ఎస్సై, ఫారెస్ట్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, రైల్వే, పంచాయతీ కార్యదర్శి, ఆర్ఆర్బీ, ఫైర్ డిపార్ట్మెంట్లో జరిగే పరీక్షలకు కూడా ఉపయోగపడేలా శిక్షణ కొనసాగుతున్నది. విద్యార్థులు ఏది అడిగినా పటాన్చెరు ఎమ్మెల్యే తక్షణం వాటిని వారికి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముందుగా పోలీసు ఉద్యోగాలకు మాత్రమే శిక్షణ అనుకున్నా, తరువాత అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయోగపడేలా శిక్షణనిస్తున్నారు. గోపీ ఆకాడమీ తయారు చేసిన ప్రత్యేక సిలబస్ను అభ్యర్థులకు అందజేస్తున్నారు. ప్రతిఒక్కరికీ స్టడీ మెటీరియల్ ఉచితంగానే ఇస్తున్నారు. క్రమశిక్షణతో పాటు అత్యుత్తమమైన బోధన అందిస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ ఆదేశాలతో పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి క్యాంప్ను సందర్శించి, వారిలో ఆత్మైస్థెర్యాన్ని, క్రమశిక్షణను నింపుతున్నారు.
నర్సాపూర్లో..
నర్సాపూర్,మే 18 : పట్టణంలోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలలో అభ్యర్థుల కోసం నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, పోలీస్ శాఖ భాగస్వామ్యంతో ఉచిత శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మొదట అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి, స్క్రూటినీ చేసి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ శిబిరంలో మొత్తం 450 మంది యువతీ యువకులు ఎంపికయ్యారు. వీరికి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుభవజ్ఞులైన ఫాకల్టీతో విద్యా బోధన చేస్తున్నారు. పోలీస్, గ్రూప్ ఉద్యోగాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ అందజేశారు. శిక్షణ కేంద్రాన్ని సీఐ షేక్లాల్ మధార్, ఎస్సై గంగరాజు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలి
అభ్యర్థులు ఉచిత శిక్షణా కేంద్రా న్ని సద్వినియోగపరుచుకోవాలి. కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలి. మీ ఉద్యోగ సాధనలో పోలీస్ శాఖ తరుఫున ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందజేస్తాం. మీరు ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలనేదే మా కోరిక. ఉచిత శిక్షణ తరగతికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తాం.
–రోహిణి ప్రియదర్శిని, ఎస్పీ, మెదక్
ఎమ్మెల్యే సహకారంతోనే సాధ్యమైంది
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా మెరుగైన శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఎస్పీ రమణకుమార్ ఆదేశాలతో పోలీస్ శాఖ ముందుకు రావడంతో అభ్యర్థులకు భరోసా కలిగింది. పోలీస్ శాఖకు ఉపయోగపడే స్టడీ మెటిరీయల్ కాకుండా అన్ని జాబ్స్కి ఉపయగపడేలా ఏర్పాటుచేశాం. తొంబై రోజుల శిక్షణ విద్యార్థులను కొత్త లక్ష్యాలకు దగ్గర చేస్తుంది.
–కిక్కర గోపి శంకర్యాదవ్, క్యాంప్ కమాండర్ ఆఫీసర్, పటాన్చెరు
విజయవంతం చేస్తాం
అందరి సహాయ సహకారాలతో శిక్షణా తరగతులను విజయవంతం చేస్తాం. మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పర్యవేక్షణలో, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ సహకారంతో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించాం. హైదరాబాద్కు చెందిన శౌర్య పోలీస్ అకాడమీ వారితో అభ్యర్థులకు శిక్షణ ఇప్పిస్తున్నాం. యువతీ యువకులకు అర్థమయ్యే రీతి లో విద్యా బోధన జరుగుతున్నది. వారికి సంబంధించిన స్టడీ మెటీరియల్ను అందజేస్తున్నాం. ఇది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ఈ స్టడీ మెటీరియల్ ఉంటుం ది. ఫిజికల్ ఫిట్నెస్కు సంబంధించిన శిక్షణను త్వరలో ప్రారంభిస్తాం. చాలామంది ఉద్యోగాలు సాధించేలా కృషి చేస్తున్నాం. – షేక్లాల్ మధార్, సీఐ, నర్సాపూర్
అందరు ఉద్యోగాలు సాధించాలి
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తెలంగాణ నిరుద్యోగుల కోసం ఉద్యోగ ప్రకటన ఇచ్చి, కొత్త ఉత్సాహం నింపారు. దీన్ని మా బాధ్యతగా నెరవేరుస్తున్నాం. ఈసారి 5 వందల మందికి ఉచితంగా శిక్షణనిస్తున్నాం. గతంలో 263 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది జాబ్స్ సాధించాలి. ఖర్చుకు వెనుకాడకుండా శిక్షణనిస్తున్నాం. ప్రతి అభ్యర్థి ఉద్యోగం సాధించాలి.
–పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి