తూప్రాన్, మే 18: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. బుధవారం తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి నెల మొదటి బుధవారం సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన నిర్వహిస్తున్నామన్నారు. సైబర్ నేరాల్లో డబ్బుల రికవరీ దాదాపు అసాధ్యమని అన్నారు. సాధ్యమైనంత వరకు అపరిచిత వ్యక్తులకు నగదు బదిలీ చేయకుండా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెబితే వెంటనే ఆ నంబర్లును బ్లాక్ చేయాలని, ఓటీపీలు తదితర వివరాలు చెప్పకూడదని తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే ఎన్సీఆర్పీ వెబ్సైట్లో ఫిర్యాదుగానీ, టోల్ ఫ్రీ నెం 1930కి గానీ, 100కు కానీ తెలియజేయాలని సూచించారు. రోడ్డు ప్రమాద ఘటనలు భావోద్వేగంతో కూడుకున్నవని, అలాంటివి చూసినప్పుడల్లా చాలా బాధకరంగా ఉంటుందని అన్నారు.
ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, త్రిపుల్ రైడింగ్ చేయకూడని, చలాన్ల ముఖ్యోద్దేశం ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తం చేయడానికేనని అన్నారు. కళాబృందం ద్వారా రోడ్డు ప్రమాదాలపై వారంలో 5 రోజుల పాటు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. షీటీమ్స్, యాంటి ఉమెన్ ట్రాప్లు సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు జిల్లా టాస్క్ఫోర్స్తో కృషి చేస్తున్నామన్నారు. గతేడాది 1451 కేసులు నమోదైతే, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 529 కేసులు నమోదయ్యాయన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, సీఐ శ్రీధర్, ఎస్సైలు సురేశ్కుమార్, యాదవరెడ్డితో పాటు తూప్రాన్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.