మెదక్, జూలై 17 : పాల ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాడి పశువుల కొనుగోలు చేసేందుకు స్త్రీనిధి పరపతి సమాఖ్య ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో శాస్త్రీయ అవగాహన, లాభసాటి పశుపోషణ బ్రోచర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాకు 3వేల పాడి పశువులు లక్ష్యం కాగా, 20 మండలాలు, మెప్మాలకు కలిపి ఇవ్వనున్నట్లు చెప్పారు. పాడి పశువుల పథకానికి సంబంధించి స్త్రీ నిధి సమాఖ్య నియమ నిబంధనలకు అనుగుణంగా రుణాలను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. రుణ సౌకర్యం కింద కొనుగోలు చేసే గెదేలు తప్పనిసరిగా పొరుగు రాష్ర్టాల్లోనే కొనుగోలు చేయాలని తెలిపారు. సంఘంలో ఉన్న సభ్యులకు మాత్రమే ఈ రుణ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. స్త్రీ నిధి జనరల్ లోన్, జీవనోపాధుల లోన్కు సంబంధించి జిల్లాకు రూ.117.50 కోట్లు 2021-22 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యాన్ని నిర్ణయించారని, ఇందులో ఇప్పటి వరకు రూ.6కోట్లు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, అదనపు డీఆర్డీవో భీమయ్య, జోనల్ మేనేజర్ రవికుమార్, ఆర్ఎం రాజశేఖర్రెడ్డి, స్త్రీ నిధి మేనేజర్ మహేందర్, రమేశ్, సిద్ధలక్ష్మి పాల్గొన్నారు.
ఆగస్టు 15న ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శన
ఆగస్టు 15వ తేదీన ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు మెదక్ కలెక్టర్ హరీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున వినూత్న ఆవిష్కరణల ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ప్రభు త్వం అవకాశం కల్పించిందని పేర్నొన్నారు. విద్యార్థులు గ్రామీణ, పట్టణ ఆవిష్కరణలకు స్టార్టప్, సూక్ష్మ చిన్న తహార పరిశ్రమ రంగాలకు సంబంధించినవారు, వ్యవసాయదారులు, యువ శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలను ఈ నెల 25లోపు వాట్సాప్ నంబర్ 91006 78543కు పంపించాలన్నారు. ఉత్తమమైన ఐదింటిని స్వాతంత్య్రం దినోత్సవం రోజున ఆన్లైన్లో ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణలు రెండు నిమిషాల వీడియో, నాలుగు ఫొటోలు, ఐదు వాక్యాల్లో వివరాలు, పేరు, వయస్సు, వృత్తి, మొబైల్ నంబర్, జిల్లా, మండలం, గ్రామంతో కూడిన వివరాలను పంపించాలని సూచించారు. వివరాలకు ఇంటింటా ఇన్నోవేటర్ జిల్లా సమన్వయకర్త, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి 832859915ను సంప్రదించాలన్నారు.