మెదక్, ఏప్రిల్ 21: అన్నదాత కుటుంబానికి రైతుబీమా పథకం కొండంత అండగా నిలుస్తోంది. రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15, 2018లో ఎల్ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకొని ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. గుంట జాగ ఉన్న రైతుకు కూడా ఈ పథకం లో అవకాశం కల్పించడంతో పాటు బీమా ప్రీమియం సొమ్మును ప్రభుత్వ మే భరిస్తోంది. ప్రమాదం, సాధారణ మరణంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన సమయంలో బీమా సొమ్ము ఆర్థికంగా ఆదుకుంటోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో పథకంపై అవగాహన కల్పిస్తోంది. ప్రతి ఇంటికి తిరిగి రైతుల పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతి ఏడాది ఆగస్టు 14నుంచి పది రోజుల పాటు రైతు బీమాలో చేరేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నది.
18నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు రైతులకు..
తెలంగాణ ప్రభుత్వం 18నుంచి 60ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతులకు ఆగస్టు 15, 2018నుంచి రైతు బీమా కింద రూ. 5లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నది. రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోంది. ఏదైనా కారణాల వల్ల రైతు మరణం సంబవించినచో కుటుంబంలో ఈ పథకం కింద రూ. 5లక్షల బీమా పొందుతున్నారు. ఇదిల ఉండగా రైతు బీమా పొందడానికి రైతులు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. రైతు చనిపోతే రైతు కుటుంబంలో నామినీకి పది రోజుల వ్యవధిలోనే రూ. 5లక్షలు బీమా సొమ్ము బ్యాంకులో జమ అవుతాయి. బీమా కార్యక్రమం కింద రైతు మరణం సహజమా లేదా ప్రమాదవశాత్తు సంబంధం లేకుండా రైతుల కుటుంబాలకు బీమా మొత్తం లభిస్తుంది.
నాలుగేళ్లలో 3472 మంది లబ్ధిదారులు
మెదక్ జిల్లాలో రైతుబీమా పథకంలో ఇప్పటి వరకు 2,39,070మంది రైతులను సర్వే చేయగా, 1,49,210 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మొత్తం 3472 మంది రైతులకు రూ.173.60కోట్లు జమ అయ్యాయి. ఇదిలావుండగా 2018-19వ సంవత్సరంలో 1,08,982 మంది రైతులు, 2019-20 సంవత్సరంలో 1,16,897, 2020-21లో 1,33,556, 2021-22లో 1,49, 210 మంది రైతులు అర్హులుగా గుర్తించారు. ఇందులో 2018లో 707మంది రైతులకు రూ. 35.35 కోట్లు, 2019లో 864 మంది రైతులకు రూ.43.20కోట్లు, 2020లో 1397 మం ది రైతులకు రూ.69.85 కోట్లు, 2021లో 504మంది రైతులకు రూ. 25.20కోట్లు రైతు చనిపోయిన తర్వాత వారి నామినీ ఖాతాలో జమ అయ్యాయి. మొత్తం నాలుగేండ్లలో 3472మంది రైతులకు రూ. 173.60కోట్లు ప్రభుత్వం రైతు బీమా కింద జమ చేసింది.
నామినీ అకౌంట్లో బీమా
రైతు బీమాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. రైతు చనిపోయిన వెంటనే ఏఈవోలు రైతుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. అన్ని ఒకే అనుకున్న తర్వాత సంస్థ నుంచి నేరుగా రూ. 5లక్షలు బాధిత నామినీ ఖాతాలో జమ అవుతున్నాయి. బీమా పొందడానికి రైతులు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
– పరుశురాంనాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
రెండో కూతురు పెండ్లి చేస్తా…
రైతు బీమా ద్వారా మా కుటుంబాన్ని ఆదుకున్న దేవు డు సీఎం కేసీఆర్. నా భర్త చనిపోయిన తర్వాత బీమా ద్వారా రూ. 5లక్షలు నా అకౌంట్లో జమ అయ్యాయి. నాకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. పెద్ద కూతురి పెండ్లి చేశాను. చిన్న కూతురు పెండ్లి కోసం రైతు బీమా నుంచి వచ్చిన రూ. 5 లక్షలతో పెండ్లి చేస్తా. రైతు బీమా ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికారులు వేగంగా పూర్తి చేశారు.
– గుండు లక్ష్మీ, నవాబ్పేట, మెదక్
రైతుబీమా ద్వారా రూ. 5 లక్షలు వచ్చాయి..
రైతుబీమా ద్వారా నా అకౌంట్లో రూ. 5లక్షలు వచ్చా యి. నాకు వచ్చిన పైసలతో రూ. 3లక్షల వరకు అప్పులు కట్టుకున్నా. మిగతా రూ. 2లక్షలు నా ఇంటి ముందు రేకు ల షెడ్డు వేసినా. నా భర్త చనిపోయిన తర్వాత రైతు బీమా కు సంబంధించిన పత్రాలను ఏవోకు ఇచ్చినా. 20రోజుల్లోనే నా అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. ఆ డబ్బులు మా కుటుంబానికి అండగా నిలిచాయి.
– దుర్గాబాయ్, కుషన్గడ్డ తండా, కౌడిపల్లి మండలం