తూప్రాన్ రూరల్, జూన్ 19: తూప్రాన్ను స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం కోసం తనవంతు కృషి చేస్తున్నానని, ప్రజలు సహకరిస్తే ఆదర్శ పట్టణంగా మారుస్తానని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ అన్నారు. కమిషనర్ మోహన్తో కలిసి శనివారం 1వ వార్డులో సమావేశాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పట్టణంలోని 16 వార్డుల్లో సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.ఇందులో భాగంగానే వార్డుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నానన్నారు. ఆయా వార్డుల్లోని ప్రజలు తమ ఇండ్ల ఎదుట హరితహారం మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు.అంతకు ముందు తాగునీరు, విద్యుత్ సరఫరా,సీసీ రోడ్ల నిర్మాణాలపై ప్రజల నుంచి విజ్ఞప్తులను కమిషనర్, ఆర్ఐ రమేశ్ స్వీకరించారు.ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు సత్తార్,అజార్,వార్డు ప్రజలు పాల్గొన్నారు.