గీతమ్లో మహిళా దినోత్సవంలో ప్రొఫెసర్ శాంతా సిన్హా
పటాన్చెరు, మార్చి 9: స్త్రీ-పురుషులకు సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని సమానత్వం, స్వేచ్ఛ, లౌకిక విలువలు, సామాజిక న్యాయ సూత్రాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు, పద్మశ్రీతో పాటు రామన్ మెగసేసే అవార్డులను అందుకున్న ప్రొఫెసర్ శాంతా సిన్హా సూచించారు. ఐఎఫ్ఎస్ పూర్వ అధికారి సీఎస్ రామలక్ష్మీ హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. స్థిరమైన భవిష్యత్ కోసం లింగ సమానత్వాన్ని పాటించడం అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ లింగ సమానత్వం అవసరాన్ని నొక్కి చెప్పారు. మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తులను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. మహిళలను ఎక్కడికంటే అక్కడకు, ఎప్పుడంటే అప్పుడు వెళ్లనివ్వకుండా నియంత్రించడం సరికాదన్నారు.
అది స్త్రీ స్వేచ్ఛను హరించడమేనన్నారు. ప్రజా రవాణాలో మహిళలను తాకడం సరికాదని, అది వ్యక్తిగత దాడిగానే ఆమె అభివర్ణించారు. ఏ రకమైన దుస్తు లు ధరించాలనేది ఆయా మహిళ ల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉం టుందని, దానిపై ఇతరులు వ్యా ఖ్యలు చేయడం సరికాదని ఆమె ఖండించారు. మహిళల భద్రతకోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ అధ్యా యం చేయాలని ఈ సందర్భంగా ప్రొపెసర్ సిన్హా కోరారు.
నిత్య జీవితంలో మహిళలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలను రామలక్ష్మీ వివరించారు. మన దేశంలో మహిళా శ్రామికశక్తి 27శాతమేనని తెలిపారు. అది పురుషులతో సమానస్థాయికి చేరినప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా మనం ఎదుగుతామన్నారు. తల్లిపాల ఆవశ్యకతను ఆమె గుర్తు చేస్తూ, కనీసం పది నెలల పాటు తల్లిపాలు ఇవ్వాలని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ మాట్లాడారు. కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, గీతం మహిళా సాధికారత కమిటీ సమన్వయకర్తలు డాక్టర్ ఎన్ ప్రసన్నలక్ష్మి, డాక్టర్ కే తేజస్తీ, కళాకృతి బృందం, లలిత సింధూరి పాల్గొన్నారు.