మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 26: సమాజానికి ఉపయోగపడే ప్రయోగాలు చేసేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దడం సంతోషంగా ఉందని, విద్యార్థుల్లోని సృజనాత్మత బయటకి తెచ్చేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగ పడుతాయని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో 50వ జిల్లా స్థాయి బాలల రాష్ట్రీయ వైజ్ఞానిక ప్రదర్శన మూడోరోజు శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయపరంగా అభివృద్ధి సాధ్యమని, ఈ మార్గంలో విద్యార్థులు నడిచి భావిశాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరుగుతుందని, భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయొద్దని, ప్రతి నిమిషం ఎంతో విలువైనదన్నారు. ప్రతి విద్యార్థి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూమిపై మంచి వాతావరణం ఉన్నప్పుడే ఆరోగ్యవంతంగా జీవించగలుగుతామన్నారు. జిల్లా విద్యాశాఖకు ఎమ్మెల్సీ నిధుల నుంచి సైన్స్ మొబైల్ వాహనానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పాటలతో ప్రదర్శనలు ప్రతిబింబించాయి. తునికి గురుకుల పాఠశాల విద్యార్థి సంకీర్త్ పిట్టల దొర వేషధారణతో పాటు తన మాటలతో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు.
తిలకించిన 18,000 మంది విద్యార్థులు
మూడు రోజుల పాటు జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనను 19,500 మంది విద్యార్థులు సందర్శించారు. మూడో రోజు పాపన్నపేట, హవేళీఘనపూర్, వెల్దుర్తి, మాసాయిపేట, చిలిపిచేడ్, కౌడిపల్లి మండలాల్లోని 75 పాఠశాలలకు చెందిన 6,000 మంది విద్యార్థులు తిలకించారు. అంతేకాకుండా, వీరితో పాటు చాలా మంది విద్యార్థులు, తదితరులు ప్రదర్శనకు హాజరయ్యారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు సుభాశ్, మండల విద్యాధికారి నీలకంఠం, వైద్యుడు పెంటాగౌడ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శ్రీనివాస్, ప్రణీద్, రాజగోపాల్గౌడ్, సుదర్శనమూర్తి, రాంకిషన్, సత్యనారాయణరెడ్డి, సుంకరి కృష్ణ, మల్లారెడ్డి, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మారిన కాలానికనుగుణంగా మారాలి..
కాలానికనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. ముగింపు వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మారిన పరిస్థితులకునుగుణంగా మనం సైతం మారాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి డాక్టర్, ఇంజినీర్, పోలీస్ అధికారి కావాలని లేదా ఒక కేసీఆర్, ఒక మోదీ లాగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం పిల్లల ఇష్టాన్ని గుర్తించి ఆ వైపు వెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు.
– దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు
వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం
మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేసేందుకు సహకరించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లకు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులకు మూడు రోజుల పాటు వసతి కల్పించిన విద్యాసంస్థల యాజమాన్యాలు, భోజన వసతి కల్పించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మున్సిపల్, పోలీసు, వైద్య సిబ్బంది చేసిన సేవలను అభినందించారు.
రాష్ట్రస్థాయికి ఎంపికైన ఎగ్జిబిట్లు..
వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి 19 ఎగ్జిబిట్లు ఎంపికయ్యాయి. సీనియర్ విభాగంలో 7 ఎగ్జిబిట్లు , జూనియర్ విభాగంలో 7 ఎగ్జిబిట్లు, ఉపాధ్యాయ విభాగంలో 1, ఇన్స్పైర్ విభాగంలో 4 ఎగ్జిబిట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి ఎంపికైన ఎగ్జిబిట్ల విద్యార్థులతో పాటు, జిల్లా స్థాయిలో విజేతలకు ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్రావులు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.
సీనియర్ విభాగంలో..
1. హవేళీఘనపూర్ మండల కేంద్రానికి చెందిన మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి జస్వంత్ ప్రదర్శించిన
‘హైడ్రాలిక్
కార్ పార్కింగ్’.
2. రేగోడ్ మండలం లింగాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని భాగ్యలక్ష్మి ‘సేంద్రియ వ్యవసాయం’.
3. పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి విష్టువర్దన్ ప్రదర్శించిన ‘మరుగుదొడ్లను స్వయంగా శుభ్ర పరిచే యంత్రం’ ప్రదర్శన.
4. మంబోజిపల్లి గీతా పాఠశాల విద్యార్థిని సమిత ‘మహిళల రక్షణ’.
5. మెదక్ సరస్వతీ కాన్వెంట్ హైస్కూల్ విద్యార్థి నిర్ముక్త ‘పార్కింగ్ వరదల
నుంచి రక్షించే ఇల్లు’.
6. పాపన్నపేట మండలం చీకోడ్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి సిద్ధూ
‘సూర్యకాంతిని ఇంటి కాంతిగా మార్చడం.’
7. మెదక్ మంబోజిపల్లి సిద్దార్థ్ రూరల్ పాఠశాల విద్యార్థి విహర్నాథ్
‘ప్రాథమిక అనుపాత సిద్ధాంతం.’
జూనియర్ విభాగంలో…
1. మెదక్ మంబోజిపల్లి సిద్ధార్థ్ రూరల్ పాఠశాల విద్యార్థి రిక్కి మార్టిన్
‘త్రిమిత్రీయ హాలోగ్రామ్ పెట్ట్టె.’
2. తూప్రాన్ గీతా పాఠశాల విద్యార్థిని సృజన ‘పూల వ్యర్థాల నిర్వహణ.’
3. హవేళీఘనపూర్ మండలం కూచన్పల్లి జడ్పీ స్కూల్ విద్యార్థిని హారిక
‘బ్లోయింగ్ బ్రూమ్.’
4. తూప్రాన్ మండలం అల్లాపూర్ జడ్పీ పాఠశాల విద్యార్థి తనూజ్గౌడ్ ‘స్మార్ట్ డస్టర్.’
5. నర్సాపూర్ గీతా పాఠశాల విద్యార్థి కిషన్ ప్రదర్శించిన
‘వాతావరణ నమూనా హరిత గృహ వాయువు.’
6. మెదక్ వెస్లీ పాఠశాల విద్యార్థి రిషి ‘స్మార్ట్ అగ్రి కల్చరల్.’
7. మెదక్ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థిని సిద్ర తస్మీన్ ‘సంఖ్యలతో మ్యాజిక్.’
ఇన్స్పైర్ విభాగంలో..
1. పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి జడ్పీఎస్ విద్యార్థిని నందిని
‘అవసరమైన విధంగా సర్దుబాటు చేసుకునే గ్యాస్ స్టౌ ప్లాట్ఫాం’.
2. రామాయంపేట టీఎస్డబ్ల్యుఆర్ఎస్ విద్యార్థిని శృతి ‘చెత్తను తొలగించే రోబోట్.’.
3. కౌడిపల్లి మండలం తునికి గురుకుల పాఠశాల విద్యార్థిని హారిక ‘గ్లాస్ టాప్ ట్రాలీ.’
4. కొల్చారం మండలం కిష్టాపూర్ ప్రైమరీ పాఠశాల విద్యార్థి వినయ్కుమార్
‘ఓవర్ హెడ్ ప్రొజెక్టర్.’
ఉపాధ్యాయ విభాగంలో..
1. తూప్రాన్ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయురాలు రజిత ‘సేంద్రియ దంతపొడి.’