మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 25 ః తరగతి గదిలో ఉపాధ్యాయులు కలిగించిన ప్రేరణ.. సమాజంలో కనిపించిన సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు బాల మేధావులు. విజ్ఞానం వికాసం కోసమే కాదు.. జనహితం కోసం అన్న మహనీయుల స్ఫూర్తిని అణువణువూ నింపుకొని ఎన్నో అద్భుతమైన ఎగ్జిబిట్లు ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల కండ్లల్లో కసి, ఏదో సాధించాలనే పట్టుదలతో ఆవిష్కరణలు రూపొందించారు. మెదక్లోని వెస్లీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బాలల రాష్ట్రీయ వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా రెండో రోజు శుక్రవారం విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎగ్జిబిట్లను ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. నేటి బాలలే.. రేపటి శాస్త్రవేత్తలు అన్న మాటను నిజం చేస్తున్నారు. విద్యార్థులు తరగతి గదికే పరిమితం కాకుండా తాము నేర్చుకున్న అంశాలకు సృజనను జోడించి వివిధ అంశాలపై తయారుచేసిన ఎగ్జిబిట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నిత్య జీవితంలో సైన్స్ లేనిదే మానవ మనుగడ లేదనే నిజానికి సైన్స్ ముడిపడి ఉంటుందని ప్రదర్శన రూపంలో తెలియజేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పోటాపోటీగా ప్రయోగాలను తయారు చేసి ప్రదర్శిస్తుండడంతో సైన్స్ ఫెయిర్ సందడిగా మారింది.
పరిశీలించిన న్యాయ నిర్ణేతలు
ఈ ప్రదర్శనల్లో ముఖ్యంగా సమాచారం ప్రసార సాంకేతికతలో పురోగతి, పర్యావరణ అనుకూల పదార్థాలు, ఆరోగ్యం-పరిశుభ్రత, రవాణా-ఆవిష్కరణ, మానవ తప్పిదాలతో పర్యావరణానికి కలిగే అనర్థాలు, ప్రస్తుత ఆవిష్కరణలతో చారిత్రక అభివృద్ధి, మన కోసం గణితం అనే అంశాలపై తయారు చేసిన నమూనాలు, వాటి గురించి వివరిస్తున్న తీరును న్యాయ నిర్ణేతలు పరిశీలించి విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి మూడు రోజుల కార్యక్రమం విజయవంతం అయ్యేలా ఎప్పటికప్పుడు ప్రదర్శన కమిటీలను సమన్వయ పరుస్తూ చర్యలు తీసుకుంటున్నారు.
తిలకించిన 10,500 విద్యార్థులు
వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా రెండో రోజైన శుక్రవారం జిల్లాలోని కొల్చారం, తూప్రాన్, మనోహరాబాద్, శివ్వంపేట, పెద్ద శంకరంపేట, రేగోడ్, అల్లాదుర్గం, చిన్న శంకరంపేట, టేక్మాల్, నర్సాపూర్, చేగుంట, నార్సింగి మండలాల్లోని 92 పాఠశాలలకు చెందిన 10,500 మందికి పైగా విద్యార్థులు తిలకించారు. వీరితో పాటు స్థానికంగా ఉండే విద్యార్థులు, తదితరులు సైన్ ఫెయిర్కు హాజరయ్యారు.
శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకే ప్రదర్శనలు..
విద్యార్థుల్లోని మేధోసంపత్తిని వెలికి తీసేందుకు నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనలు భవిష్యత్తులో వారికి ఎంతో మేలు చేస్తాయి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి, దేశ పురోగాభివృద్ధికి బాల మేధావుల సహకారం అవసరం. విద్యార్థుల అంతర్గత శక్తి సామర్థ్యాన్ని శాస్త్రీయ దృక్పథాన్ని గుర్తించి బాల శాస్త్రవేత్తలను తయారు చేసే అద్భుతమైన కార్యక్రమమే ఈ వైజ్ఞానిక ప్రదర్శన.
-సంగయ్య, చిన్న ఘనపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు
ఎన్నో కొత్త విషయాలు
జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. భిన్నమైన ప్రయోగాలను ఒకే దగ్గర చూడటం వల్ల సైన్స్ పట్ల మరింత ఆసక్తి పెరిగింది. పాఠ్యాంశాలల్లోని పలు అంశాలను ఇక్కడ ప్రయోగాల ద్వారా చూడటం ద్వారా కొత్త అంశాలను నేర్చుకున్నట్లయింది.
– మానస, కూచన్పల్లి జడ్పీహెచ్ఎస్
స్మార్ట్ డస్టర్ ఆవిష్కర్త : తనూజ్ గౌడ్
గైడ్ టీచర్ : మమత పాఠశాల పేరు : జడ్పీహెచ్ పాఠశాల అల్లా పూర్, మనోహరాబాద్ మండలం.
వివరణ : డస్టర్ వల్ల ఉపాధ్యాయులకు ఎక్కువగా కంటి సమస్యలతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అదే స్మార్ట్ డస్టర్ వాడితే డస్ట్ను రానివ్వదు.
కోతులు రాకుండా సెన్సార్ అలారం ఆవిష్కర్త : లాజర్
గైడ్ టీచర్ : శివలింగాగౌడ్ పాఠశాల పేరు : కుర్తివాడ ఉన్నతపాఠశాల, పాపన్నపేట మండలం వివరణ : ఇంటి గుమ్మం వద్ద ఏర్పాటు చేసుకున్న సెన్సార్కు లేజర్ కాంతి అడ్డుగా వచ్చినప్పుడు తలుపు ముందుకు కోతులు రాగానే సెన్సార్పై కాంతి అవరోధంగా ఏర్పడి అలారం మోగుతుంది. దీంతో ఇంట్లోకి కోతులు రాకుండా జాగ్రత్త పడొచ్చు.
ధాన్యం కుప్పల నుంచి రోడ్డు ప్రమాదాలు నివారణ
ఆవిష్కర్త : యోహాన్
గైడ్ టీచర్ : రమణకుమార్ పాఠశాల పేరు : జడ్పీహెచ్ పాఠశాల చిన్న ఘనపూర్, కొల్చారం మండలం
వివరణ : రోడ్డుపై ధాన్యం కుప్పలు పోసి వాటిపై టాపర్లు కప్పినప్పుడు ఆ స్థలం అపాయకరమైనదిగా గుర్తించేందుకు టాపర్లపై ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో రేడియం స్టిక్కర్లను అతికించాలి. వాహనాల హెడ్లైట్ కాంతి టాపర్లపై పడగానే రేడియం స్టిక్కర్లు ప్రకాశవంతంగా కనబడి వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండాజాగ్రత్త పడతారు.