దుబ్బాక, నవంబర్ 25 : ప్రజా రవాణా సారథులు.. ఆర్టీసీ ఉద్యోగులు.. ప్రగతి రథ చక్రాలు నడిపే శ్రామికులు.. ఇతర వృత్తులతో పోలిస్తే డ్రైవర్ కొలువు అత్యంత కష్టంతో కూడుకున్నది. గంటల తరబడి సీట్లో కూర్చోవాలి. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ బస్సు నడుపాలి. ప్రయాణికులను సురక్షంగా గమ్యస్థానాలకు చేర్చాలి. అలాగే కండక్టర్ల విధులు కూడా డ్రైవర్లతో సమానమైన శ్రమ. ఎండ, వాన, చలి తాకిడిని తట్టుకుంటూ గంటల కొద్దీ పని చేస్తారు. సమయం దొరికినప్పుడు తింటారు.. విశ్రాంతి తీసుకుంటారు.. వీరు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషిస్తూ.. తమ కుటుంబాలను సైతం పట్టించుకోలేని దుస్థితి వీరిది. ఇంతటి రిస్క్తో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్టీసీలోని ప్రతి కార్మికుడికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతిష్ఠాత్మకరంగా ‘గ్రాండ్ హెల్త్’ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికీ పలు జిల్లాలో ఆర్టీసీ బస్ డిపోల్లో హెల్త్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ డిపోల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి, కార్మికులకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి హైదరాబాద్లోని ఆర్టీసీ దవాఖానలో ఉచితంగా వైద్య చికిత్సలు అందించనున్నది.
డిసెంబర్ 5వరకు హెల్త్ డ్రైవ్..
టీఎస్ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ డ్రైవ్లో భాగంగా జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 13 నుంచి డిసెంబర్ 5 వరకు హెల్త్ డ్రైవ్ కొనసాగనున్నది. ఇప్పటికే జిల్లాలోని హుస్నాబాద్ డిపోలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో వైద్య శిబిరం నిర్వహించి, ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు. సిద్దిపేట, దుబ్బాక డిపోల్లో ఈ నెల 27 నుంచి హెల్త్ డ్రైవ్ కొనసాగనున్నది. అనంతరం గజ్వేల్ డిపోలో హెల్త్ డ్రైవ్ ఉంటుందని అధికారులు తెలిపారు.
నాలుగు డిపోల పరిధిలో..
సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ డిపోల పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక వైద్య నిపుణలు, సిబ్బందితో ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేస్తారు. జిల్లాలోని నాలుగు డిపోల్లో మొత్తం 1261 మంది ఉద్యోగులున్నారు. ఇందులో డ్రైవర్లు 431మంది, కండక్టర్లు 453 మంది, మెకానిక్, ఇతర సిబ్బంది 377 మంది ఉన్నారు.
హెల్త్క్యాంపు..ఉద్యోగులకు వరం
గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ బలోపేతంతో పాటు సంస్థలో పని చేస్తున్న కార్మికులను ఉద్యోగులుగా గుర్తించడం చాలా సంతోషకరం. సీఎం కేసీఆర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేక చొరవతో ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయం. గతంలో వైద్య పరీక్షల కోసం హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు డిపోల వద్దకే వైద్యులు వచ్చి పరీక్షలు చేయడంతో వ్యయప్రయాసాలు తప్పాయి.
– కె. మహేశ్, కండక్టర్, దుబ్బాక
17రకాల పరీక్షలు
వైద్య నిపుణులు బీపీ, ఈసీజీ, డయాబెటిక్ వంటి 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల ద్వారా ఉద్యోగులు, సిబ్బంది మున్ముందు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను పసిగట్టే అవకాశం ఉంటుంది. వైద్యపరంగా ముందే చికిత్స తీసుకునే వీలుంటుంది. హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో కార్మికుల హెల్త్ ప్రొఫైల్స్ నిక్షిప్తంగా ఉంటుంది. హెల్త్ ప్రొఫైల్ను బట్టి చికిత్స అందిస్తుంటారు.
హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం సంతోషకరం
నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ ఎంతో ఒత్తిడికి గురవుతుంటాం. గంటల తరబడి కొనసాగే విధి నిర్వహణతో పాటు కుటుంబ సమస్యల తదితర కారణాలతో మా ఆరోగ్యాన్ని పట్టించుకోలేని పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డిపోల్లో హెల్త్ క్యాంపు నిర్వహించి , వైద్య పరీక్షలు చేయడం సంతోషకరం. దీర్ఘకాలిక వ్యాధులుంటే ముందస్తుగా తెలుసుకోవడంతో పాటు మెరుగైన వైద్యం తీసుకుని అవకాశం ఉంటుంది.
– ఎంఎస్ రెడ్డి, డ్రైవర్, దుబ్బాక