రామచంద్రాపురం, నవంబర్25: క్రెడిట్ కార్డు లోన్ రికవరీ పర్సన్స్ ఒత్తిడితో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆర్సీపురం పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్నగర్కాలనీలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన ఎం.రామారావు (33) కొంత కాలంగా ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్నగర్కాలనీలో నివాసం ఉంటున్నాడు. వోలా బైక్రైడర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్య స్వప్నతో పాటు పాప ఉంది. అతను ఎస్బీఐ, బజాజ్ ఆర్బీఎల్, ఐడీఎఫ్సీ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నాడు. క్రెడిట్ కార్డ్స్ నుంచి సుమారుగా రూ.2లక్షల వరకు లోన్స్ తీసుకుని తిరిగి చెల్లించలేదు. ఈ విషయంలో ఆయా బ్యాంక్లకు సంబంధించిన రికవరీ పర్సన్స్ ఒత్తిడిని భరించలేక అతను ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు క్రెడిట్ కార్డ్స్ రికవరీ పర్సన్స్ ఒత్తిడితోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో రాశాడు. తన భార్యకు చెందిన రెండు తులాల బంగారం తాకట్టు పెట్టి డబ్బులు కట్టడంతో పాటు తన బైక్ అమ్మి క్రెడిట్ కార్డ్స్ లోన్స్కు సంబంధించి ఎస్బీఐకి రూ.70వేలు, బజాజ్ ఆర్బీఎల్కు రూ.60 వేలు, ఐడీఎఫ్సీకి రూ.70వేలు చెల్లించినట్లు అందులో పేర్కొన్నాడు. అయినా ఇంకా డబ్బులు కట్టాలని బ్యాంకు వాళ్లు వేధిస్తుండడంతో తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నానని నోట్లో తెలిపాడు. బ్యాంకు రికవరీ వాళ్ల ఫోన్ నంబర్లను నోట్లో రాశాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో ఎస్సై వెంకటేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.