మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద
మెదక్ అర్బన్, నవంబర్19: నిందితులకు కోర్టులో శిక్ష పడేలా పోలీసులు శ్రమించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద ఆదేశించారు. శనివారం జిల్లా న్యాయస్థానాల సముదాయంలో న్యాయమూర్తి ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుంచి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలు నిరూపించేందుకు రుజువులు, సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించడంలో పోలీసులు బాధ్యత తీసుకోవాలన్నారు. కోర్టుల్లో విచారణ అధికారుల హాజరు ముఖ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ ఫజల్ అహ్మద్, ఏజీపీ శ్రీనివాస్, ఎక్సైజ్ అధికారులు, కోర్టు లైజనింగ్ అధికారి విఠల్ పాల్గొన్నారు.
కుల ప్రస్తావనను తీవ్రంగా ఖండిస్తున్నాం
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరి హనుమంతరావు
శివ్వంపేట, నవంబర్ 19: రాజకీయ పార్టీల పోరులో కుల ప్రస్తావన తీసుకురావడంపై మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరి హనుమంతరావు ఖండించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మున్నూరుకాపులు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల్లో వారి స్థాయి పదవుల్లో కొనసాగుతూ, పార్టీ అధిష్టానం ఆదేశాలతో సిద్ధాంతాలు, కట్టుబాట్లపై పని చేస్తున్నారన్నారు. మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య బీజేపీ కండువా కప్పుకకుని మున్నూరుకాపులపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
రాజకీయ పార్టీల వివాదాలకు కులాలను లాగడం సరికాదన్నారు. సమాజంలో అన్ని కులాలు సఖ్యతతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మనుగడ సాగించాలని, రెచ్చగొట్టడం, మున్నూరుకాపులను సమాజం నుంచి దూరం చేయడమే అవుతుందని అన్నారు. టీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సర్పంచ్ నుంచి జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లుగా ఎంతో మందికి పదవులు కట్టబెట్టారన్నారు. మున్నూరుకాపు కులబాంధవుల మనోభావాలు దెబ్బతీయడం ఒక పార్టీకే కొమ్ము కాస్తున్నట్లుగా దేవయ్య ఆరోపించడం ఒక నాయకుడి లక్షణం కాదని ఆయన అన్నారు.
పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
కౌడిపల్లి, నవంబర్ 19: పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి విజయ్శేఖర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలో బుజరంపేట్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ, విజయ డెయిరీ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. విజయ డెయిరీ డీడీ శ్రీనివాస్తో కలిసి దళిత బంధు లబ్ధిదారుల షెడ్లు, బర్రెలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ పశు పోషకు లు చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బర్రెలకు పోషకాలున్న దాణ, మినరల్ పౌడర్లు, క్యాల్షియం ఇవ్వాలన్నారు.
గర్భకోశ వ్యాధులు, అనారోగ్యంతో బాధపడుతున్న కొన్ని పశువులను గుర్తించి వాటికి చికిత్సలు చేశామన్నారు. ఎదకు రాని పది పశువులను గుర్తించి కుత్రిమ గర్భధారణ, గర్భకోశ వ్యాధులు గల 38 పశువులకు చికిత్స, 64 దుడ్డెలకు నట్టల నివారణ మందులు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో విజయ డెయిరీ జీఎంజీన్ రంజిత్, కౌడిపల్లి డాక్టర్ రాజు, ఎంపీటీసీ లింగం, జేవీఓ కృష్ణ కుమార్, ఎల్ఎస్ఏ వీరారెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ చెన్నయ్య, పంచాయతీ సెక్రటరీ రాజిరెడ్డి, గోపాలమిత్రలు నెల్లూరు, మాణయ్య, కవిత, దళిత బంధు లబ్దిదారులు, రైతులు పాల్గొన్నారు.