సిద్దిపేట, నవంబర్ 19: విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ సిద్దిపేటలో చేపట్టిన ‘శ్రీకృష్ణ కాల చక్రం’ కార్యక్రమానికి శనివా రం అంకురార్పణ జరిగింది. తొలిరోజు గణపతి పూజతో అయుత చండీ, అతిరుద్ర యాగం ప్రారంభమైంది. సీతారామ పట్టాభిషేకంతో పాటు 78వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం మొదలైంది. సిద్దిపేట పట్టణంలోని వేముల వాడ కమాన్ వద్ద గల యాగశాలలో కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు, రుత్వికులు పూజలు చేశారు.
తొలి రోజు గణపతి పూజ, శుద్ధిపుణ్యహవచనం, పంచగవ్యప్రాశన, రుత్విక్వరుణ, గో సహిత యాగశాల ప్రవేశం, అఖండ జ్యోతి స్థాపన, యాగశాల సంస్కారం, మాతృకాపూజ, మండపారాధనలు, వాస్తు హోమాలు, ప్రధాన మండప ఆరాధన, ప్రధాన కలశ స్థాపన, అగ్నిమధన, సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక కల్యాణంతో పాటు గోమాత, తులసి పూజ, సహాస్ర లింగార్చన, రుద్రాభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి భక్తులకు ఆశీర్వవచనలు అందజేశారు. లోక కల్యాణార్థం యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ భక్తి భావంతో భగవంతుని నామస్మరణ చేయాలని సూచించారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే లక్ష్యం యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.