పుట్టుకతోనే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కష్టం వర్ణణాతీతం. ఈ సమస్యలతో పసిప్రాయంలోనే చిన్నారులు మృత్యువాత పడుతుండడంతో తల్లిదండ్రులకు కడుపుకోత తప్పడం లేదు.
ఈ పరిస్థితుల్లో చిన్ని గుండెకు అభయం ఇచ్చేందుకు శ్రీసత్యసాయి ట్రస్ట్ ముందుకు వచ్చింది. పేద చిన్నారులను ఆదుకునేందుకు సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం వృద్ధాశ్రమం వద్ద ‘సంజీవని చైల్డ్ హార్ట్కేర్ అండ్ రీసెర్చ్ను’ ఏర్పాటు చేసింది. దీనిని నేడు(గురువారం) ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, ట్రస్ట్ ప్రతినిధి సద్గురు మధుసూదన సాయి ప్రారంభిస్తారు. ఇందులో పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందిస్తారు. దేశంలో ఇది నాలుగో దవాఖాన కావడం విశేషం.
– కొండపాక, నవంబర్ 16
దేశ విదేశాల్లోని నిరుపేదలకు విద్య,వైద్యసేవలు అందిస్తున్న సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తెలంగాణలోనూ తన సేవలను అందిస్తున్నది.సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం వృద్ధాశ్రమం వద్ద సత్యసాయి శాంతినికేతన్ బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నది.కొత్తగా ఇక్కడ ‘శ్రీసత్యసాయి సంజీవిని దవాఖాన’ ఏర్పాటు చేశారు. దీనిని నేడు ప్రారంభించనున్నారు. తద్వారా పేద పిల్లల గుండెకు భరోసా ఏర్పడనున్నది.
కొండపాక, నవంబర్ 16
సిద్దిపేట జిల్లా కొండపాకలో సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘శ్రీసత్యసాయి సంజీవిని దవాఖాన’లో ఏర్పాటు చేశారు. 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్లతో ఈ దవాఖాన నిర్మాణానికి 2022 జనవరి 17న భూమిపూజ చేశారు. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు పూర్తి చేసుకొని గురువారం (నేడు) రాష్ట్ర ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, సద్గురు మధుసూదన సాయి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.
ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగో చిన్నపిల్లల గుండె సంరక్షణ పరిశోధన కేంద్రం ఇది. దేశంలో ఇప్పటి వరకు నయా రాయ్పూర్ (ఛత్తీస్గఢ్), పల్వల్ (హర్యానా), నవీ ముంబయి (మహారాష్ట్ర)లో సత్యసాయి ట్రస్ట్ ద్వారా మాతా శిశు సంక్షేమ దవాఖానలు ఏర్పాటు చేసి ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. నాలుగోది కొండపాక శివారులో నేడు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఔట్ పేషెంట్ విభాగాన్ని మాత్రమే ప్రారంభిస్తున్నామని, రెండు మూడు నెలల్లో ఆపరేషన్ సేవలు అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఈ లోపు ఆపరేషన్ అవసరమైన చిన్నారులకు సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇతర దవాఖానల్లో ఉచిత వైద్యం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో ఈ దవాఖాన స్థాయిని పెంచి మాతా శిశు సంక్షేమ దవాఖానగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఉచితంగా వైద్యసేవలు, మందులు…
సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంజీవిని దవాఖానలో పూర్తిస్థాయిలో ఉచిత వైద్యసేవలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. వైద్యం కోసం వచ్చే వారికి ఉచితంగా వైద్యం చేయడంతో పాటు మందులు ఉచితంగా అందజేస్తామన్నారు. 24గంటల వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు.ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓపీ విభాగం ద్వారా సేవలు అందిస్తామని తెలిపారు. ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా చేయడంతో పాటు మందులు, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
ఆధునిక సాంకేతికతతో అద్భుత దవాఖాన…
గుండె సంబంధిత జబ్బులతో జన్మించే శిశువులకు భవిష్యత్తులో ఎలాంటి హృద్రోగ సమస్యలు రాకుండా సంజీవని దవాఖాన ప్రత్యేక వైద్యసేవలు అందించనున్నది. 100 పడకల సామర్థ్యం.. ఆధునిక వైద్య పరికరాలు.. నిష్ణాతులైన వైద్యులు.. పూర్తిస్థాయి డిజిటల్ ల్యాబ్ పరికరాలు ఈ దవాఖానలో ఏర్పాటు చేశారు.
శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా…
గుండె సంబంధిత సమస్యలతో జన్మించే శిశువుల మరణాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ‘శ్రీసత్యసాయి సంజీవని దవాఖాన’ల్లో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. మన దేశంలో ఏటా 3లక్షల మంది చిన్నారులు గుండె సంబంధిత సమస్యలతో జన్మించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో 25శాతం అనగా.. సుమారు 75 వేల మంది చిన్నారులు పసిప్రాయంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి చిన్నారులను కాపాడడానికి సత్యసాయి ట్రస్ట్ ఈ దవాఖానలు ఏర్పాటు చేసింది
విద్యారంగంలో తనదైన ముద్ర..
సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయ ట్రస్ట్ ఆవరణలో 12ఎకరాల విస్తీర్ణంలో సత్యసాయి విద్యాసంస్థను ఏర్పాటు చేసి బాలికలకు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుతున్నారు. క్రమశిక్షణను అలవర్చుతున్నారు. ఇప్పుడు ఇదే ప్రాంతంలో సంజీవని దవాఖాన అందుబాటులోకి వస్తుండడంతో చిన్నారులకు భరోసా ఏర్పడనున్నది.
హాజరుకానున్న ప్రముఖులు…
‘శ్రీసత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ‘సంజీవిని చైల్డ్ హార్ట్కేర్ అండ్ రీసెర్చ్ దవాఖాన’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, సద్గురు మధుసూదన సాయితో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీహెచ్ఎంవో కాశీనాథ్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, జడ్పీటీసీ అనంతుల అశ్వినీప్రశాంత్, ఎంపీపీ ర్యాగల్ల సుగుణదుర్గయ్య, కొండపాక సర్పంచ్ చిట్టి మాధురితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
మంత్రి హరీశ్రావు చొరవతో…
ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సూచనలతో ఈ దవాఖానను కొండపాక వద్ద ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో సత్యసాయి విద్యాసంస్థల వార్షికోత్సవ సమయంలో మంత్రి హరీశ్రావు, సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధి మధుసూదనా సాయితో ప్రత్యేకంగా మాట్లాడారు. సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రాంతంలో దవాఖాన నిర్మాణం చేయాలని కోరారు.
కేవీ రమణాచారి సహకారంతో ఆనంద నిలయం ట్రస్ట్ ఆవరణలో 3ఎకరాల భూమిని దవాఖానకు నిర్మాణానికి ఇవ్వడంతో పాటు మరో 2 ఎకరాల భూమిని ఆనంద నిలయం ట్రస్ట్ నుంచి నామమాత్రపు ధరను చెల్లించి కొనుగోలు చేశారు. ఈ ఐదు ఎకరాల్లో అధునాతన భవంతిలో దవాఖానతో పాటు రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.