మెదక్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ధరణి పోర్టల్, పీవోబీ నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాం గం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలోని 21 మండలాలకు సంబంధించిన తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది రికార్డులను పరిశీలించి కలెక్టర్కు పంపుతున్నారు. మూడు రోజులుగా మెదక్ కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ యంత్రాంగం పీవోబీ(ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్) నిషేధిత జాబితాలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి తొలగిస్తున్నారు. వారం రోజుల పాటు కలెక్టరేట్లో రెవెన్యూ యంత్రాంగం పనిలో నిమగ్నమైంది. జిల్లా వ్యాప్తంగా 369రెవెన్యూ గ్రామాల్లో 350 గ్రామాల్లో పీవోబీ మాడ్యూల్స్ పూర్తి చేశారు. మిగిలిన సర్వే సబ్ డివిజన్ పూర్తి చేయడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది.
పరిష్కార మార్గం దిశగా..
పదేండ్ల నుంచి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. గతంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల ఖాతాలు ధరణి పోర్టల్లో లింక్ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు పట్టా భూములతో పాటు సీలింగ్, ఎండోమెంట్, వక్ఫ్, భూ దాన్, ఇలా పలు రకాల భూములు కొన్ని నిషేధిత జాబితాలో ఉన్నాయి. దీంతో రైతుల నుంచి పెద్ద ఎత్తున ప్ర భుత్వానికి దరఖాస్తులు వచ్చాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా నిషేధిత భూముల సర్వే సబ్ డివిజన్ క్లియర్ చేస్తున్నది. దీంతో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
నిషేధిత జాబితాలో నుంచి తొలగింపు..
కొన్నేండ్ల పాటు కోర్టులో ఉన్న భూముల కేసులను పరిష్కరిస్తున్నారు. కోర్టులో కేసులు ఉంటే నిషేధిత జాబితాలో చేర్చడం లేదు. జిల్లాలో పెద్ద ఎత్తున భూ సేకరణ చేపట్టారు. జాతీయ రహదారులు, రైల్వేలైన్ మార్గ, కాళేశ్వరం ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి భూ ములు సేకరించారు. రైతుల నుంచి భూములను సేకరించిన అనంతరం సర్వే నంబర్ మొత్తం ప్రొహిబిటెడ్ లిస్టు లో ఉంచారు. దీంతో ఆ సర్వే నంబర్ మొత్తం ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్లడంతో రైతులు ఆ భూములు అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈ విషయాలపై పెద్ద ఎత్తున రైతుల నుంచి దరఖాస్తులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత జాబితాల్లో ఉన్న భూములకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముందుకు సాగుతున్న ది. 2013 వరకు పీవోబీలను క్లియర్ చేశారు.
ఎప్పటికప్పుడు కలెక్టర్ పర్యవేక్షణ
జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు పంపించిన జాబితాలు కలెక్టర్ ఎస్.హరీశ్ మరోసారి పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని వెనక్కి పం పుతున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ హాల్లో పొద్దున, రాత్రి వేళల్లో పరిశీలిస్తున్నారు. జిల్లాలో 19000 సబ్ డివిజన్లలో ఇప్పటి వరకు 14000 క్లియర్ చేశారు. ధరణి పోర్టర్లో ఉన్న టీఎం 33 కరెక్షన్కు 3000ల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1400 పూర్తి చేశారు. మిగతా వాటిని మరో రెం డు రోజుల్లో పూర్తి చేయడానికి కలెక్టర్ హరీశ్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.
వంద శాతం పూర్తి చేస్తాం – ఎస్.హరీశ్, జిల్లా కలెక్టర్
ధరణి పోర్టర్లో ఉన్న నిషేధిత ఉన్న జాబితాలో 80 శాతం సబ్ డివిజన్లను క్లియర్ చేశాం. మరో 20శాతం సబ్ డివిజన్లను రెండు రోజుల్లో పూర్తి చేస్తాం. జిల్లా వ్యాప్తంగా 19000 సబ్ డివిజన్లలో 14000 క్లియర్ చేశాం. జిల్లాలో 369 రెవెన్యూ గ్రామాల్లో సుమారుగా 350 గ్రామాల్లో పీవోబీ మాడ్యూల్స్ పూర్తి చేశారు. టీఎం 33 మాడ్యూల్స్లో 3000 దరఖాస్తులు రాగా 1400 క్లియర్ చేశాం. మరో రెండు రోజుల్లో వందశాతం పూర్తి చేస్తాం.