వేదఘోషతో పరిసరాలు పులకించాయి. చండీమాత సేవలో భక్తజనం తరించింది. లోక కల్యాణం కోసం రామచంద్రపురంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ ఆవరణలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శతచండీ మహాయాగం శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అశేష భక్తజనం తరలిరాగా.. చండీమాత నామస్మరణతో యాగశాల ప్రాంగణం మార్మోగింది.
రామచంద్రాపురం, నవంబర్ 11: రుద్రసహిత శతచండీ మహాయాగానికి సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని కాకతీయనగర్ కాలనీలో ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయం వేదికైంది. శుక్రవారం ఉదయం ఆర్సీపురం మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శతచండీ మహాయాగం వైభవంగా ప్రారంభమైంది.
స్తున్నారు. ఈ సందర్భంగా రామాలయాన్ని ముస్తాబు చేశారు. ఆలయం ముందు చండీయాగానికి సంబంధించి హోమ మండపం ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్న హాల్లో చండీమాతను ప్రతిష్ఠించి వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, కలశ పూజ జరిపారు. నాలుగు దిక్కులుగా వేదపండితులు కూర్చుని శతచండీ పారాయణాల్లో భాగంగా 40చండీ సప్తశతి పారాయణాలు, 1000 గణపతి
అధర్వశీర్ష పారాయణాలు, చతుర్వేద పారాయణాలు గావించారు. సహస్ర మోదక హోమం, లక్ష కుంకుమార్చన కార్యక్ర
మాలు నిర్వహించారు.
శతచండీ యాగంలో భాగంగా మొదటి రోజు శుక్రవారం శాంతి పఠనం, గోపూజ, గురువందనం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్వ మేళనం, ఆచార్యాది రుత్విక్ వరుణం, మాతృక, యోగిని, వాస్తు, క్షత్రపాలక, నవగ్రహ, సర్వతోభద్ర, లింగతోభద్ర, ప్రధాన కలశస్థాపనలు, సహస్రావర్తన గణపత్యధర్వణ శీర్ష పారాయణం, యాగశాల సంస్కారణం, అరణీమథనం, అగ్నిప్రతిష్ఠ, సహస్రమోదకగణపతి హవనం, మహామంగళ హారతి, మంత్రపుష్పం, స్థాపిత దేవతా పూజలు, శ్రీసూక్త పారాయణాలు, నవాక్షరి మూలమంత్ర అనుష్ఠానం, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు.
శతచండీ యాగానికి హాజరైన భక్తుల కోసం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. వేదపండితులు, భక్తులకు వేర్వేరు చోట్ల అన్నప్రసాద వితరణ చేపట్టారు. బ్రాహ్మణుల చేత ప్రత్యేకంగా వండించిన వంటకాలనే భక్తులకు వడ్డించారు. మూడు రోజుల పాటు మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రుద్రసహిత శతచండీ యాగంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొరేటర్ పుష్పానగేశ్, టీఆర్ఎస్ నాయకుడు ఆదర్శ్రెడ్డి శుక్రవారం పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లోక కల్యాణార్ధం కోసం బ్రాహ్మణులు అందరూ కలిసి శతచండీ యాగాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ యాగం జరుపుతున్నందుకు బ్రాహ్మణ సంఘం మండల సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలని కోరారు.
– గూడెం మహిపాల్రెడ్డి,ఎమ్మెల్యే, పటాన్చెరు
శత చండీయాగాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. చండీయాగంతో కాకతీయనగర్ కాలనీ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. అమ్మవారి పారాయణాలు వింటూ భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. మూడు రోజుల పాటు జరిగే శతచండీ యాగానికి సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. చండీ యాగం నిర్వహించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన వేదపండితులకు నిర్వాహకులు సౌకర్యాలు కల్పించారు. యాగానికి సంబంధించి వేదపండితులు ధరించే ఒకే రకం వస్ర్తాలు, పూజా సామగ్రిని నిర్వాహకులే సమకూర్చారు.