అందోల్, నవంబర్ 3: ఉదయం పూట దట్టంగా అలుముకున్న చలి మంచు ఓ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసింది. కండ్లు మూసి తెరిసేలోపే మంచు చాటు నుంచి బస్సు రూపంలో వచ్చిన మృత్యువు నలుగురి ప్రాణాలు బలితీసుకుంది. రాత్రంతా బంధువులతో కలిసి దావత్లో హాయిగా గడిపిన కుటుంబం తెల్లారేసరికి మృత్యు ఒడికి చేరుకున్నది. మృతుల్లో భార్యాభర్తలు, కూతురు, మనుమరాలుండగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి మృతి చెందడం వారి బంధువులు జీర్ణించుకోలేకపోయారు. మృతి చెందిన వారిలో రెండేండ్ల పసిపాప ఉండడంతో హృదయవిదారక ఘటనను చూ సిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. గురువారం తెల్లవారుజామున మండలంలోని కన్సాన్పల్లి శివారుల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ప్రమాదానికి సంబంధించి జోగిపేట ఎస్సై సామ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని దెగ్లూర్ ప్రాంతానికి చెందిన దిలీప్(50) వినోద(45) భార్యా భర్తలు. పెద్ద కూతురు సుప్రతి( స్వీటీ 25), కాంక్ష్య ( 2) మనుమరాలుతో కలిసి హైదరాబాద్ (జీడిమెట్ల-సుభాశ్నగర్)లో నివాసముంటు న్నారు. బుధవారం స్వగ్రామంలో బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండగా కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లి గురువారం ఉదయం హైదరాబాద్ వస్తుండగా అందోల్ మండలం కన్సాన్పల్లి శివారులో వారు ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్పు ఎదురుగా బలంగా ఢీ కొట్టడంతో నలుగురు కారులోనే మృతిచెందారు. తెల్లవారుజాము కావ డం, పొగ మంచు దట్టంగా రోడ్డును కమ్మేసి ఉండడం అంతలోనే భారీ శబ్ధం రావడం, బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులకు ఏం జరిగిందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే తేరుకుని చూసేసరికి కారులో ఉన్న నలుగురు బయటకు తీయడానికి వీలులేకుండా అందులోనే ఇరుక్కుపోయి మృతి చెందారు. కన్ను మూసి తెరిచే సమయంలోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కొన్ని గంటల పాటు శ్రమించి జేసీబీ సాయంతో కారులోనుంచి మృతదేహాలను బయటకు తీసి జోగిపేట ఏరియా దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి మృ తుల బంధులకు అప్పగించారు. మృతులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
విలపించిన బంధువులు
రాత్రంతా తమతో గడిపిన తమ కుటుంబసభ్యులు తెల్లారేసరికి మృత్యు ఒడికి చేరుకోవడంతో వారి బంధువులు, కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది. ప్రమాద విషయం తెలుసుకున్న బంధువులు జోగిపేట ఏరియా దవాఖానకు, పోలీస్స్టేషన్ వద్దకు చేరకుని బోరున విలపించారు. రాత్రంతా మాతోనే ఉన్నారే.. తెల్లారేసరికి ఇలా… విగత జీవుల్లా ఉన్నారే ఉంటూ బోరున విలపించారు. ప్రమాద స్థలంలో కారులో ఉన్న చిన్నారి మృతదేహాన్ని చేతిలోకి తీసుకున్న జోగిపేట ఎస్సై కంటతడి పెట్టారు. ఘటనా స్థలం సంగారెడ్డి- హై దరాబాద్ ప్రధాన రహదారి కావడంతో రోడ్డు మొ త్తం భీకరంగా మారింది. కొన్ని గంటల్లోనే ప్రజలు అక్క డికి చేరుకోవడం, పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగ మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. వీలైనంత వరకు ఉదయంపూట, పొగమంచులో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.