బెజ్జంకి, అక్టోబర్ 23 : నిరుపేద కుటుంబానికి చెందిన కుటుంబ యజమాని రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో వైద్యానికి లక్షలు ఖర్చు అవుతున్నాయని డాక్టర్లు చెప్పడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మండలంలోని గాగిల్లాపూర్కు చెందిన కట్టుకోజ్వల సంతోష్చారి వీడియో గ్రాఫర్గా పనిచేసి కుటుంబాన్ని సాకుతున్నాడు. సంతోష్కు దాచారం గ్రామానికి చెందిన మౌనికతో తొమ్మిదేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి అనుశ్రీ, మనుశ్రీ ఇద్దరి కూతుళ్లు ఉన్నారు. భర్త అనారోగ్యానికి గురికావడంతో దవాఖానకు వెళ్లాడు. డాక్టర్లు పరీక్షించి రెండు కిడ్నీలు పనిచేయడం లేదని చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించారు. కిడ్నీ బాగు కోసం ఆస్థిని అమ్మి చికిత్స చేయించుకుంటున్నాడు. రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడంతో తొలిగించాలని వైద్యులు చెప్పారు.
సంతోష్చారి రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో భార్య మౌనిక కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. మౌనిక కిడ్నీని భర్తకు మార్చేందుకు వైద్యులు నిర్ణయించారు. వైద్యానికి డబ్బులు లేకపోవడంతో సంతోష్చారి కుటుంబ పరిస్థితిని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ఎమ్మెల్యే హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో కిడ్నీల మార్పిడికి ఎల్వోసీ అందజేశారు. మూడు నెలల పాటు దవాఖానకు అందుబాటులో ఉండాలని భార్యాభర్తలకు వైద్యం చేయాలని డాక్టర్లు సూచించారు. హైదరాబాద్లో ఉండేందుకు డబ్బులు లేకపోవడంతో సంతోష్చారి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 97049 99934 నంబర్కు ఫోన్పే, గోగూల్పే చేయాలని, 07351 0100043321, UBIN 0807354 నంబర్ యూనిన్ బ్యాంకు బెజ్జంకి ఖాతాలో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు.