తూప్రాన్ రూరల్, జూన్ 7 : ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు గడిపేందుకు, మానసిక ప్రశాంతత పొందడానికి, పని ఒత్తిడి సమయాల్లో విశ్రాంతి తీసుకునేందుకు, వృద్ధులు, చిన్నారులు ఉల్లాసంగా గడుపడానికి, యువకులు వాకింగ్ చేయడం కోసం అందుబాటులో ఉండేవిధంగా తూప్రా న్ మండలం కోనాయిపల్లి(పీబీ)లో నిర్మించిన పల్లెప్రకృతివనం చూడముచ్చటగా కన్పిస్తుంది. గ్రామ శివారులోని రెండెకరాల విస్తీర్ణంలో ఈజీఎస్ కేటాయించిన రూ.6 లక్షలతో పల్లె ప్రకృతివనాన్ని నిర్మించారు. వీటిలో 2,950 వివిధ రకాల మొక్కలు నాటారు. పల్లెప్రకృతివనంలో నిర్మించిన వాకింగ్ ట్రాక్లకు ఇరువైపులా మొదటి వరుసలో నీడనిచ్చే మొక్కలు, రెండో వరుసలో పండ్లు, పూల మొక్కలు, మూడో వరుసలో ఆహ్లాదకరంగా కన్పించే వివిధ రకాలైన మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. నాటిన మొక్కలను ఏపుగా పెంచేవిధంగా గ్రామస్తులు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు.
చూడముచ్చటగా రాతిగుండ్లు
ఇక్కడి రాతి గుండ్లకు పెయింటింగ్లు వేసి చూడముచ్చటగా తీర్చిదిద్దారు. అక్కడి వాతావరణం చూస్తే ఆహ్లాదకరంగా కన్పిస్తుంది. చూసిన వారంతా కాసేపు అక్కడే విశ్రాంతిని తీసుకుంటున్నారు.
రూ.6 లక్షలతో పల్లెప్రకృతివనాన్ని నిర్మించాం..
రూ.6 లక్షలతో పల్లెప్రకృతివనాన్ని నిర్మించాం. రెండెకరాల విస్తీర్ణంలో వివిధ రకాలైన మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నాం. నాటిన మొక్కలకు నీటిని అందిస్తూ ఏపుగా పెరిగేలా కృషి చేస్తున్నాం. పాలకమండలి సభ్యులు, గ్రామస్తుల సహకారంతో వృథాగా ఉన్న రాతిగుండ్లకు పెయింటింగ్లు వేయించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం.
-కంకనాల పాండు, కోనాయిపల్లి (పీబీ) సర్పంచ్
చూడముచ్చటగా కన్పిస్తుంది..
పల్లెప్రకృతివనంలో నాటిన మొక్కలను చూస్తే ఎంతో బాగున్నాయి. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి మొక్కలు ఉపకరిస్తాయి. ఇక్కడకు వెళితే కాసేపు ఉండాలని అనిపిస్తుంది.
-నాగరాజు,కోనాయిపల్లి(పీబీ) గ్రామస్తుడు
ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడింది..
నాటిన మొక్కలకు నీటిని అందిస్తున్నాం. ప్రకృతి ఎలా ఉండాలో ప్రజలకు అర్ధమమయ్యే విధంగా రాతిగుండ్లకు పెయింటింగ్వేశారు. మొక్కలతో దట్టమైన అటవీ ప్రదేశంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా మారుస్తాం. ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే గ్రామస్తుల ఉద్దేశం.
-శంకర్, కోనాయిపల్లి,(పీబీ) గ్రామస్తుడు