తూప్రాన్/రామాయంపేట, ఫిబ్రవరి 19 : పురపాలికల అభివృద్ధికి పురపాలికలే ట్యాక్స్ల రూపంలో నిధులను సమకూర్చుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శనివారం రామాయంపేట మున్సిపల్ బడ్జెట్ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన అదనపు కలెక్టర్కు మున్సిపల్ బడ్జెట్ను సిబ్బంది చదివి వినిపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీలో చెత్త సేకరణకు కూడా బిల్లులను వసూలు చే యాలన్నారు. లైసెన్సు ఫీజులు, ఇంటి, నల్లాల ట్యాక్స్లను కచ్చితంగా వసూలు చేయాలన్నారు. పట్టణం అభివృద్ధి చెందాలంటే నిధులను సమకూర్చుకోవాలన్నారు. పారిశుధ్య కార్మికులు, సిబ్బంది జీతాలు, చెత్త ఆటోలు, ట్రాక్టర్ల మెయింటెనెన్సు కావాలంటే మున్సిపల్లో నిధులు ఉండాలన్నారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, కమిషనర్ శ్రీనివాసన్, మేనేజర్ శ్రీనివాస్లు పట్టణానికి అవసరమైన పనుల జాబితాను అదనపు కలెక్టర్కు సమర్పించారు. సమావేశంలో చైర్మన్ జితేందర్గౌడ్తో పాటు వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, కౌన్సిలర్లు యాదగిరి, గజవాడ నాగరాజు, సరాఫ్ సౌభాగ్య, దేవుని జయ, చంద్రపు శోభ, మల్యా ల కవిత, సుందర్సింగ్, చిలుక గంగాధర్, చింతల రాధాభవాని, బొర్ర అనిల్, సిబ్బంది ప్రసాద్, నవాత్ ప్రసాద్, బల్ల శ్రీనివాస్, శంకర్, నరేశ్, అశ్విత ఉన్నారు.
తూప్రాన్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో..
తూప్రాన్ మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హాజరయ్యారు. శనివారం తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తూప్రాన్లో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ సభ దృష్టికి తీసుకొచ్చారు. పూర్తైన వెంటనే మంత్రి హరీశ్రావును ఆహ్వానించి మున్సిపల్, వెజ్ అండ్ నాన్వెజ్, సమీకృత భవనాలు, సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లను ప్రారంభిస్తామని చైర్మన్ తెలిపారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నల్లాల బిల్లులు, ఇంటి ట్యాక్స్లు, వ్యాపారస్తుల లైసెన్సుల రెన్యూవల్లను కచ్చితంగా వసూలు చేయాలన్నారు. సమావేశంలో చైర్మన్ రవీందర్గౌడ్, కమిషనర్ మోహన్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు.