మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 19: కలెక్టరేట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆర్అండ్బీ ఈఈ శ్యాంసుందర్ను ఆదేశించారు. ఏప్రిల్లో ముఖ్యమంత్రి మెదక్ పర్యటన ఉంటుందని ఈలోగా మొత్తం పనులు పూర్తి కావాలన్నారు. ఈ విషయమై ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డితో ఆమె ఫోన్లో మాట్లాడారు. ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేస్తామని గణపతిరెడ్డి చెప్పినట్లు పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. శనివారం జడ్పీ 2, 4, 7వ స్థాయీ సం ఘం సమావేశాలు జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్ అధ్యక్షతన జరిగాయి. 7వ స్థాయీ సంఘం సమావేశానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఈఈకి సూచించారు. కలెక్టరేట్ సముదాయంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ల నివాస గృహాల పనులు సైతం త్వరలో పూర్తికానున్నట్లు శ్యాంసుందర్ ఎమ్మెల్యేకు తెలిపారు. రామాయంపేట పాత రోడ్డు నుంచి జాతీయ రహదారి వర కు రోడ్డుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్అండ్ బీ అధికారులను పద్మాదేవేందర్రెడ్డి సూచించారు. పాపన్నపేట మండలం నుంచి కామారెడ్డి జిల్లాకు కలిపే బ్రిడ్జి పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు. హవేళీఘనపూర్ మండలంలోని రాజ్పేట బ్రిడ్జి పనులను సైతం త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. పలు గ్రామాల్లో లో ఓల్టేజీ సమస్య ఉందని, దానిని త్వరగా పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఈఈ కృష్ణారావుకు ఎమ్మెల్యే సూచించారు.
ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచిందని, కూలీల వేతనాన్ని ప్రభుత్వం పెంచడం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ చెప్పారు. జిల్లాలో 14 బృహత్ పల్లె ప్రకృతి వనాలు పూర్తయ్యాయని, రెండో విడుతలో ప్రతి మండలంలో నాలుగు బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. చేగుంట మండలంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ చేగుంట జడ్పీటీసీ శ్రీనివాస్లు కాలుష్య నియంత్రణాధికారి సిద్దార్థ్ స్వామి దృష్టికి తీసుకురాగా, నిబంధనలు పాటించని మూడు పరిశ్రమలను మూసివేయించినట్లు చెప్పారు. అలాగే, పలు పరిశ్రమలకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. చేగుంట మండలం సహకార సంఘంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ జిల్లా సహకార అధికారి కరుణకు సూచించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా అధికారులు నివేదికలను చదివి వినిపించారు. సమావేశాల్లో చిన్నశంకరంపేట జడ్పీటీసీ మాధవి, నిజాంపేట జడ్పీటీసీ విజయ్కుమార్, నార్సింగి జడ్పీటీసీ కృష్ణారెడ్డి, జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్, జిల్లా ప్రభుత్వ దవఖానాల సూపరింటెండెంట్ చంద్రశేఖర్, రవాణా శాఖ, నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ అధికారులతో పాటు జడ్పీ సీఈవో శైలేష్, డిప్యూటీ సీఈవో సుహాసిని, సూపరింటెండెంట్ మల్లేశంతో పాల్గొన్నారు.