దుబ్బాక, అక్టోబర్ 6: సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రవేశించడం శుభపరిణామమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా బుధవారం రాత్రి తన స్వగ్రామమైన దుబ్బాక మండలం పోతారంలో జరిగిన వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు. గురువారం ఉదయం గ్రామంలో నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి హాజరయ్యారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. సీఎం కేసీఆర్ విజయ దశమి రోజున బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం సంతోషకరమన్నారు. బీఆన్ఎస్ పార్టీతోనే నవ భారత్ సాధ్యమన్నారు. దేశ రాజకీయలలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. సీఎం కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. బీఆర్ఎస్ దేశంలోని అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు మద్దతు కూడగట్టుకుందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎలా అవతరించిందో.. అదేవిధంగా దేశంలో బీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా అవతరిస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ ఏ పని ప్రారంభించినా సఫలం తప్పా, విఫలం కాలేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా మెప్పు పొందాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ దేశ ప్రజల ఆత్మాభిమానంగా ఎదుగుతుందన్నారు. బీజేపీపై దేశప్రజలంతా వ్యతిరేకతతో ఉన్నారన్నారు. దేశంలో 18 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసి నిరుద్యోగ యువతకు ద్రోహం చేసిందన్నారు. భారత్లో పుష్కలమైన భౌగోళిక వనురులున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో భారత్ అభివృద్ధి సాధించలేకపోయిందన్నారు.
కేసీఆర్ నేతృత్వంలో నవ భారత్ సాధ్యపడుతుందన్నారు. ప్రపంచంలోనే భారత్ ఒక శక్తివంతమైన దేశంగా ఆవిర్భవిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రొట్టే రాజమౌళి, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, కౌన్సిలర్లు, సర్పంచ్లు ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.