సంగారెడ్డి, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన సద్దుల బతుకమ్మను జిల్లా అంతటా ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి పూజలు చేశారు. ఆ తర్వాత బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు, యువతులు, చిన్నారులు ఆడుతూ సందడి చేశారు. జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాజర్షిషా, డీఆర్వో రాధికా రమణి, మహిళా అధికారులు, సిబ్బంది బతుకమ్మ ఆడి, నిమజ్జనం చేశారు. మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో మహబూబ్సాగర్ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా విజయేందర్రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై వేడుకలు ఘనంగా జరిగాయి. నల్గొండ గద్దర్ నర్సారెడ్డితోపాటు కళాకారులు బతుకమ్మ పాటలు పాడి అందరినీ ఆలరించారు. మహిపాల్రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ, జడ్పీటీసీ సుప్రజా వెంకట్రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ, కార్పొరేటర్ పుష్పానగేశ్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మునిపల్లిలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వగ్రామం పోతులబోగూడలో ఎమ్మెల్యే సతీమణి పద్మావతి, మహిళలు పాల్గొన్నారు. నారాయణఖేడ్లో బతుకమ్మ కుంట వద్ద నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, ఆయన సతీమణి జైశ్రీరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ సువర్ణ షెట్కార్, జడ్పీటీసీ లక్ష్మీబాయి పాల్గొన్నారు.