మెదక్రూరల్, అక్టోబర్ 1: బతుకును, బతుకు దెరువు చూపిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అదనుపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శనివారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ ఆర్డీవో కార్యాలయం నుంచి టీఎన్జీవో భవన్ వరకు వాక్థాన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సంక్షేమ అధికారి బ్రహ్మాజీ ప్రారంభించారు అనంతరం టీఎన్జీవో భవనంలో సమవేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హాజరై జ్వోతి ప్రజ్వాలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలతో పిల్లల్లో దేశ సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేవన్నారు. క్రమశిక్షణతో మెలిగుతూ పెద్దల పట్ల గౌరవంగా ఉండేవారన్నారు. నేడు వివిధ కారణాలతో మానవ సంబంధాలు విచ్ఛిన్నమై, డబ్బు చుట్టూ కాలం తిరుగుతూ ఆర్థికంగా బంధాలు బలపడుతున్నాయని ఆవేదన వ్యక్తచేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంత ప్రేమగా పోషించారో అలాగే పిల్లలు కూడా వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవాలన్నారు.
ఎలాంటి వేధింపులకు గురైన వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14567 హెల్ప్ లైన్ ట్రోల్ ఫ్రీ నంబర్ను వినియోగించుకోవాలన్నారు. తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత పిల్లలదేనన్నారు. వారు పట్టించుకోకపోతే తల్లిదండ్రులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, చట్టాలు వారికి అండగా ఉంటాయని అన్నారు. అనంతరం సంక్షేమ అధికారి బ్రహ్మాజీ మాట్లాడుతూ వృద్ధులు 90 ఏండ్లపైబడి జీవిస్తున్నారంటే వారిలో మానసిక ధైర్యం, దృఢత్వం గుర్తించాలన్నారు. వారిపట్ల ప్రేమ దయ మమాకారం చూపుతూ వారి అనుభవాలను తెలుసుకుని ముందుతరాలకు అందించాలన్నారు. అనంతరం వృద్ధులను సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్ స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, శిశు సంక్షేమ కార్యాలయం సీడీపీవోలు, సూపర్ వైజర్లు, సిబ్బంది పద్మా, కరుణశీల, శ్యామ్, చిరంజీవి, రాష్ట్ర ఆల్ సర్వీస్ సిటిజన్ సంఘం జిల్లా ఇన్చార్జి జగదీశ్ చంద్ర, అధ్యక్షుడు అరుందయ్ రాజ్, జనరల్ సెక్రటరీ శ్యామ్ సుందర్ , సభ్యులు పాల్గొన్నారు.