తూప్రాన్, అక్టోబర్ 1: దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెట్టిస్తున్నారని, గడప గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. శనివారం తూప్రాన్ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి ఆయన హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డితో కలిసి మండలంలోని 19 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మండల వ్యాప్తంగా 1092 కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశామన్నారు. మహిళల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు తీసుకొచ్చి, ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటు పడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, కాళేశ్వరం, కొండపోచమ్మ, మల్లన్న సాగర్లతో సాగు నీరు, 57 ఏండ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి, అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తు, మోటార్లకు మీటర్లు పెట్టి రైతన్నల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేశ్ యాదవ్, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సతీశ్చారి, మండల ప్రధాన కార్యదర్శి పంజాల ఆంజనేయులుగౌడ్, మాజీ జడ్పీటీసీ గంగుమల్ల సుమన, కౌన్సిలర్లు, యాదగిరి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.