మెదక్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. గుసాడి నృత్యాలు.. డీజే సౌండ్లు.. బోనాల ఊరేగింపులు.. డిస్కోలైట్లు.. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మల కోలాహలాల మధ్య జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో ఆమె పాల్గొని మహిళలు, చిన్నారులతో కలిసి బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో మా తల్లి బతుకమ్మ ఊయ్యాలో అంటూ బతుకమ్మ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతో పాటు సంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని అన్నారు. పూలను పూజించే, ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ అని అన్నారు. గల్లీ, వాడ, పట్టణంతో పాటు దేశ, విదేశాల్లో బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారని పేర్కొన్నారు.
కళాశాల మైదానంలో పండుగ వాతావరణం
ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల మైదానం బతుకమ్మలతో కళకళలాడింది. ఎటు చూసినా బతుకమ్మలే దర్శనమిచ్చాయి. వందలాది మంది మహిళలు, మెప్మా సిబ్బంది తరలివచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ లావణ్యరెడ్డి, మెదక్ ఎంపీపీ యమున, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, డీఈవో రమేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్, డీఎస్వో రాజిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు రాగి వనజ, మేడి కల్యాణి, జయశ్రీ, బట్టి లలిత, మామిండ్ల ఆంజనేయులు, సమియొద్దీన్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
మహిళల సాంస్కృతిక వికాసం ఆవిష్కరించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమై దేశవ్యాప్తంగా ప్రాచూర్యం పొందిందని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సహకార శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అలిగిన బతుకమ్మ పూజా కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.
సంగారెడ్డి జడ్పీలో పాల్గొన్న మంత్రి హరీశ్రావు సతీమణి
సంగారెడ్డి, సెప్టెంబరు 30 ః జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఆవరణలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సతీమణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జడ్పీ ఆవరణలో బతుకమ్మలకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక మహిళల ఆటపాటలతో ఆనందంగా గడిపారు. బతుకమ్మ పాటలతో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు సతీమణి శ్రీనిత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను జగమంతా తెలిసేలా ప్రతి ఏటా బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకుంటున్నామన్నా రు.
పూలను పూజించే పండుగే బతుకమ్మని, మహిళలందరూ పూలను గౌరీదేవిగా ఆరాధించి, ఆటపాటలతో అనందించే గొప్ప పండుగన్నారు. వేడుకల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీ సతీమణి మంజురెడ్డి, అందోల్, నారాయణఖేడ్, పటాన్చెరు, సంగారెడ్డి ఎమ్మెల్యేల సతీమణులు పద్మిని, జయశ్రీ, యాదమ్మ, నిర్మల, ఎస్పీ సతీమణి మాధవి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీ, వైస్ చైర్మన్ లతా, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆర్డీవో మెంచు నగేష్గౌడ్, తహసీల్దారు స్వామి, మహిళలు, ఉద్యోగులు పాల్గొన్నారు.