రామచంద్రాపురం, సెప్టెంబర్ 30: ఆటోలో తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను ఆర్సీపురం పోలీసులు రిమాండ్కు తరలించారు. శుక్రవారం ఆర్సీపురం పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్ వివరాలను వెల్లడించారు. ఆర్సీపురంలో నివాసం ఉండే వృద్ధురాలు లింగమ్మ ఈ నెల 24వ తేదీన పింఛన్ డబ్బులు తెచ్చుకోవడానికి ఆర్సీపురం జాతీయ రహదారి వద్ద ఆటో ఎక్కింది. ఆమెకు సంబంధించిన బ్యాంకు అశోక్నగర్లో ఉండగా, ఆటో డ్రైవర్కు అడ్రస్ సరిగ్గా చెప్పలేకపోవడంతో అతడు ఆమెను భెల్ చౌరస్తా సమీపంలో దించాడు. పక్కనే బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లి యూనియన్ బ్యాంకుకి ఎటువెళ్లాలి అని అడగడంతో అతడు తిరిగి వెనక్కి పోవాలని చెప్పాడు. దీంతో ఆమె నడుచుకుంటూ ముందుకు వచ్చి అక్కడ ఆటో రిపేర్ చేయించుకుంటున్న ఏ1 జర్పటి యాదయ్య అలియాస్ చిన్నయాదమ్మ అలియాస్ యాదగిరి వద్దకు వెళ్లి బ్యాంకుకు వెళ్లాలని అడిగింది.
దీంతో అక్కడే ఉన్న ఏ2 పల్లేపు మహదేవ్, ఏ3 రేణు క, ఏ4 అనితలు వృద్ధురాలు లింగమ్మను ఏపీ34టీ9351 ఆటోలో ఎక్కించుకొని లింగంపల్లికి వచ్చి ఆమెకు కల్లు తాగించి అక్కడి నుంచి భెల్లోని ఎస్టీయాన్స్ స్కూల్ పరిసరాల్లోకి తీసుకువెళ్లి ఆమె మెడలో ఉన్న 35గ్రాముల బంగారు తాడు, 5 గ్రాముల కమ్మలు తీసుకొని కాళ్లకు ఉన్న కడియాలు కట్ చేసే ప్రయత్నం చేశారు. కడియాలు రాకపోవడంతో ఆమెను అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. అనంతరం తేరుకున్న లింగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఆర్సీపురం పోలీస్స్టేషన్ పరిధిలో నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 45గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. కేసుని ఛేదించిన క్రైమ్ విభాగం పోలీసులను డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.