మెదక్, ఫిబ్రవరి 14: దళితుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, వారిపై ఆయనకు ఉన్న ప్రేమేంటో తెలియజేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల ఎంపికకు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు రూ.10 లక్షలను అందజేయనున్నారని టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలుపై ఎమ్మెల్యేతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా పూర్తి చేస్తారు..?
మెదక్ నియోజకవర్గంలో 100 యూనిట్లు మంజూరయ్యాయి. వంద మంది లబ్ధిదారులు ఏయే యూనిట్లను ఎంపిక చేసుకుంటారు. వాటిపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాం. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా సాగుతున్నది. అర్హులను ఎంపిక చేస్తాం. మెదక్ నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఆరు గ్రామాలను ఎంపిక చేశాం. ఒక్క గ్రామంలో 20 మంది, మరో గ్రామంలో 18 మంది ఇలా మొత్తం ఆరు గ్రామాల్లో వంద మంది దళితులను ఎంపిక చేస్తున్నాం. ఈ ఆర్థిక సాయంతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు తీసుకుంటున్నాం.
దళిత బంధు తీరు ఎలా ఉండబోతున్నది..?
సమాజంలో దళితులు వెనుకబడి ఉన్నారు. అంబేద్కర్ చెప్పిన విధంగా అందరికీ సమానత్వం కలుగాలంటే ఆర్థిక స్వావలంభన కల్పించాలి. ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించిండ్రు. బ్యాంకుల ద్వారా కార్పొరేషన్ రుణాలు ఇచ్చారు. కానీ, ఎటువంటి షరతులు లేకుండా నేరుగా ప్రభుత్వమే లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నది. వారి ఉపాధి వారే స్వయంగా నిర్ణయించుకొని, శక్తికొద్ది పనిచేసుకొని ఆర్థికంగా ఎదిగేవిధంగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. దేశంలో ఇటువంటి పథకం లేదు. దళితబంధు ఒక ఆదర్శవంతమైన పథకంగా ఉంటుంది.
దళిత బంధు రక్షణ నిధితో ఎలాంటి ఉపయోగం ఉంటుంది..?
దళిత బంధు పథకంతో లబ్ధిదారుడు తాను ఎంపిక చేసుకున్న యూనిట్ల ద్వారా చేసే వ్యాపారంలో ఏమైనా నష్టం జరిగితే, ఆపద సమయంలో దళిత బంధు రక్షణ నిధి ఆదుకుంటుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు కేటాయించే రూ.10 లక్షల నుంచి రూ.10 వేలు రక్షణ నిధికి కేటాయిస్తారు.
లబ్ధిదారులు ఎలాంటి వ్యాపారాన్ని ఎంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు..?
లబ్ధిదారులు తమకు ఇష్టమైన యూనిట్లను ఎంచుకుని దళిత బంధు సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లబ్ధిదారులు ఎలాంటి యూనిట్లనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మామిడి టంకర్ల మిషన్, ట్రాక్టర్లు, కిరాణా షాపులు, హోటళ్లు, డెయిరీ సెంటర్లు, మహిళలు పచ్చళ్లు, మ్యాచింగ్ సెంటర్లు, బ్యూటీపార్లర్లు, కుట్టుమిషన్లు ఇలా ఎలాంటి యూనిట్లనైనా ఏర్పాటు చేసుకోవచ్చు.
దళిత బంధు పథకంపై మీ అభిప్రాయం..?
దళితులు ఇప్పటికే వెనుకబడే ఉన్నారు. వారిని ఆర్థికంగా ఆదుకుని, వారి ఎదుగుదలకు కృషి చేయడానికే సీఎం కేసీఆర్ లక్ష్యం. దళితులు జీవిత కాలంలో రూ.10 లక్షలు సంపాదించడం కష్టమే. అలాంటి వారందరూ ఆర్థికంగా వృద్ధి చెందేలా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. నూటికి నూరు శాతం సబ్సిడీతో రూ.10 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం భరోసాఇచ్చింది. నిరుపేద దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి. వారి ఎదుగుదల చూసి రాబోయే కాలంలో దళితులు మరింత అభివృద్ధి చెందాలి. దళితులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
దళిత బంధుపై ప్రతిపక్షాలు వివిధ ఆరోపణలు చేస్తున్నాయి వాటిపై మీ స్పందన?
తెలంగాణ రాష్ర్టాన్ని సాధిస్తా అన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఈ విధమైన ఆరోపణలు చేశాయి. తెలంగాణ వచ్చిందా లేదా.. వారి అనుమానం పటాపంచలైంది. 24 గంటల కరెంటు ఇస్తామని సీఎం కేసీఆర్ శాసన సభలో చెప్పినప్పుడు ప్రతిపక్షాలు నమ్మలేదు. అనుమానాలు వ్యక్తం చేశారు. 24 గంటలు కరెంటు వస్తున్నది కాదా, ఇంటింటికీ తాగునీరు ఇస్తామనప్పడు కూడా ఇది అయ్యే పథకం కాదు అన్నారు. అయినా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చి సక్సెస్ అయ్యాం. ప్రభుత్వ పథకాలపై అనుమానాలు, అవహేళనలు చేసినప్పటికీ అన్ని పథకాలు సవ్యంగా నడుస్తున్నాయి. ప్రతి పథకానికి అడ్డుపడడం, అలము విషయంలో నస పెట్టడం వారికి మామూలే. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు పరుస్తున్నారు. తప్పకుండా దళితబంధు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుంది.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎవరెవరూ ఉంటారు..?
దళిత బంధు పథకం ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యేల పాత్ర కీలకం. లబ్ధిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తారు. గ్రామాల్లో అధికారులు సర్వే చేస్తారు. ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి, దళిత నోడల్ అధికారులు లబ్ధిదారుల అర్హతలు ఎంపిక చేస్తారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
మీ రాజకీయ జీవితంలో ఇలాంటి స్కీంను ఎప్పుడైనా చూశారా..?
నా 25 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టాను. ఎక్కడ కూడా ఇలాంటి పథకం అమలు చేయలేదు. నిరుపేద దళితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారు. వెనుకబడ్డ వర్గాల కోసం నిరంతరం ఆలోచించే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినా ఇలాంటి స్కీంను తీసుకురాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. దళితుల సంక్షేమం కోసం దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.