నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొత్త మండలంగా నిజాంపేట ఏర్పాటు కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నారాయణఖేడ్లో ఆరు, కల్హేర్ పరిధిలో పది, పెద్దశంకరంపేట నుంచి ఒకటి మొత్తం 17 పంచాయతీలు కలిపి, 26,105 మంది జనాభాతో 28వ మండలంగా ఆవిర్భవించింది. దీంతో పాలన చేరువ అవడంతో పాటు మెరుగైన సేవలు అందుతాయని, దూరభారం తగ్గి సమయం ఆదా అవుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ మేరకు త్వరలోనే కార్యాలయాలు ప్రారంభించి కార్యకలాపాలు మొదలుపెట్టేలా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. బుధవారం ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తహసీల్ ఆఫీసు కోసం పలు భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధులు సన్మానించారు.
నారాయణఖేడ్, సెప్టెంబర్ 29 : ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం కల్పించాలంటే అధికార వికేంద్రీకరణ అవసరం. పనిభారం తగ్గి ప్రభుత్వ కార్యకలాపాలు వేగవంతం కావాలంటే పాలనపరమైన విభజన తప్పనిసరి. ఇందు కోసం పని విభజన అనేది ప్రభుత్వపరంగా ప్రణాళికాబద్ధమైన రీతిలో అమలు జరగాలి. ఆ దిశగానే కేసీఆర్ సర్కారు తీసుకుంటున్న విప్లవాత్మక చర్యల్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో కొత్త మండలం ఏర్పాటుకు నాంది పలికింది. ఫలితంగా నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్ కేంద్రంగా జిల్లాలో 28వ మండలంగా నిజాంపేట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నారాయణఖేడ్, కల్హేర్, పెద్దశంకరంపేట మండలాల్లోని మొత్తం 17 పంచాయతీలతో కలిపి నిజాంపేట్ మండలం అవతరించింది. 10 చదరపు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను నిజాంపేట్ మండలంలో కలపడం ద్వారా పాలనా కేంద్రాన్ని పల్లెల దరికి తరలించినైట్లెంది. ఈ మేరకు నిజాంపేట్లో త్వరలోనే ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించి ప్రభుత్వ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నది. నిజాంపేట్ కేంద్రంగా మండలం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ సాకారం కావడమే కాకుండా మంత్రి హరీశ్రావు సహకారం, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి చూపిన చొరువను నిజాంపేట్ గ్రామస్తులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు కొనియాడుతున్నారు.
నిజాంపేట్ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయా గ్రామాల ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు పట్టం కట్టింది. ఈ మండలం పరిధిలో మొత్తం 17 పంచాయతీలు, ఒక ముంపు గ్రామం ఉండగా నారాయణఖేడ్ మండలంలోని ఆరు పంచాయతీలు నిజాంపేట్, మేగ్యానాయక్ తండా, కొత్తపల్లి, ర్యాలమడుగు, మాణిక్నాయక్ తండా, తెట్టేకుంట తండా, కల్హేర్ మండలంలోని 10 పంచాయతీలు నాగధర్, రాంచందర్ తండా, మోదులకుంట తండా, మునిగేపల్లి, బాచేపల్లి, బల్కంచెల్క తండా, నాన్యానాయక్ తండా, ఖానాపూర్ (బి), రాంరెడ్డిపేట్, దామరచెరువు, పెద్దశంకరంపేట మండలంలోని జంబికుంట పంచాయతీతో పాటు కల్హేర్ మండలంలోని ముంపు గ్రామమైన మలాల్పూర్ను నిజాంపేట్ మం డలం పరిధిలోకి చేర్చారు. 26, 105 మంది జనాభా నిజాంపేట్ మండలం పరిధిలోకి రానున్నది. నారాయణఖేడ్ మండలంలోనే అతిపెద్ద పంచాయతీగా ఉన్న నిజాంపేట్ ప్రస్తుతం జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. అంతేగాక నిజాంపేట్ చుట్టూ కేవలం 10 కిలోమీటర్ల పరిధిలో అనేక గ్రామాలు, తండాలు ఉండడం నిజాంపేట్ కేంద్రంగా కొత్త మండలం ఏరాటయ్యేందుకు దోహదపడిందని చెప్పవచ్చు.
నిజాంపేట్ మండలం ఏర్పాటుతో జిల్లాలో మండలాల సంఖ్య 28కి చేరగా, నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం 8 మండలాలు అయ్యాయి. తొలుత నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, మనూరు, పెద్దశంకరంపేట మండలాలు మాత్రమే నియోజకవర్గ పరిధిలో ఉండగా తొలి విడుతగా నియోజకవర్గంలోని కల్హేర్ మండలం నుంచి సిర్గాపూర్ మండలాన్ని, మనూరు మండలం నుంచి నాగల్గిద్ద మండలాలు ఏర్పాటు కాగా, ప్రస్తుతం మరో కొత్త మండలంగా నిజాంపేట్ను ఏర్పాటు చేశారు. ఏండ్ల తరబడి అక్కడి ప్రజల అభీష్టం మేరకే టీఆర్ఎస్ ప్రభుత్వం మండలాలను ఏర్పా టు చేయడం గమనార్హం. నిజాంపేట్తో పాటు ఆయా గ్రామాల ప్రజల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి మండ ల ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితంగా సీఎం కేసీఆర్ మండల ఏర్పాటుపై హామీ ఇచ్చిన మేరకు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మంత్రి హరీశ్రావు సహకారంతో చేసిన కృషి ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. అయితే కొత్తగా ఏర్పడిన మూడు మండలాల ఏర్పాటు విషయంలోనూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
పరిశీలన : నిజాంపేట్లో తహసీల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ తహసీల్దార్ దశరథ్సింగ్తో కలిసి ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి గురువారం భవనాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, నిజాంపేట్ సర్పంచ్ జగదీశ్వర్చారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
ప్రజల ఆకాంక్షలను గౌరవించి నిజాంపేట్ కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. దీని ద్వారా కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తుందనే విషయం మరోసారి రుజువైంది. ప్రజల కష్టాలు తీర్చడమే ఎజెండాగా కేసీఆర్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని చెప్పడానికి గత ఎనిమిదేండ్లలో ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతున్న నారాయణఖేడ్ నియోజకవర్గమే ఒక ఉదాహరణ.
-మహారెడ్డి భూపాల్రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే
దశాబ్దాలుగా మేము కోరుకుంటున్న మండల ఏర్పాటును సాకారం చేసిన సీఎం కేసీఆర్ సారుకు ఎల్లకాలం రుణపడి ఉంటాం. మా నిజాంపేట్ కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయడం మాకెంతో సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, సీఎం కేసీఆర్ సారుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.
-జగదీశ్వర్చారి, నిజాంపేట్ సర్పంచ్
ఎన్నో ఏండ్లుగా మేము నిజాంపేట్ను మండలం చేయాలని కోరుతున్నాం. సమైక్య రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు పట్టించుకోలే. మా ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సార్ ఏదైనా పని పెట్టుకుంటే అది పూర్తి చేసిందాక ఊకోడనే పేరుంది. నిజాంపేట్ మండలం విషయంలో అది రుజువైంది. మా కోరికను గౌరవించి మా ఎమ్మెల్యే సార్ మంత్రి హరీశ్రావు సార్ సహకారంతో సీఎం కేసీఆర్ సార్ ఆశీర్వాదంతో మండలం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉన్నది.
– సాయిరెడ్డి, వైస్ ఎంపీపీ , నిజాంపేట్
నిజాంపేట్ కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉన్నది. మా బల్కంచెల్క తండా కల్హేర్ మండలంలో ఉండగా ఇప్పుడు నిజాంపేట్ మం డలం పరిధిలోకి చేర్చారు. సీఎం కేసీఆర్ సార్ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం ద్వారా మా తండా పంచాయతీగా ఏర్పాటైంది. మండలంలోని పంచాయతీలు ఇంకా వేగవంతంగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడుతున్నా.
-లలిత, బల్కంచెల్క తండా, సర్పంచ్