మెదక్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): చిన్నా పెద్ద తేడా లేకుండా మహిళలందరూ వైభవంగా జరుపుకొనే పండుగ బతుకమ్మ అని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ ఆవరణలో జడ్పీ, జిల్లా పంచాయతీ, గణాంక శాఖలు సంయుక్తంగా నిర్వహించిన అట్ల బతుకమ్మ పూజల్లో పాల్గొన్నారు. మండల పరిషత్ అధికారులు, పంచాయతీరాజ్ కార్యదర్శులు, గణాంక అధికారులు, మహిళా ఉద్యోగినులతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ఆనందాలు, ఆప్యాయతలను పంచడమే కాకుండా విలువలకు అద్దం పడుతుంది బతుకమ్మ పండుగ అని అన్నారు. శుక్రవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జిల్లా సహకార శాఖల ఆధ్వర్యంలో అలిగిన బతుకమ్మ నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి బతుకమ్మ సంబురాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొంటారని, అందరూ పాల్గొనాలని తెలిపా రు. కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిర, మత్స్యశాఖ సహాయ సంచాలకులు రజిని, జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్ కుమా ర్, ముఖ్య ప్రణాళికాధికారి చిన కొట్యా నాయక్, డీపీఆర్వో శాంతికుమార్, బతుకమ్మ సమన్వయాధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.
చిలిపిచెడ్, సెప్టెంబర్ 29: మన ఊరు – మనబడితో ప్రభుత్వ బడులు కొత్త వెలుగులు సంతరించుకుంటున్నాయని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. మండలంలోని ఫైజాబాద్, అజ్జమర్రి, బండపోతుగల్ గ్రామాల్లో మన ఊరు – మనబడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలలను సందర్శించారు. అనంతరం పాఠశాలలో మౌలిక వసతుల గురించి పీఆర్ ఏఈ మధుబాబు, ఎంఈవో బుచ్చనాయక్ను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని 11 పాఠశాలలు ఎంపికయ్యాయని, పనులు తర్వగా పూర్తి చేయాలని అధికారులు, విద్యా కమిటీ చైర్మన్లకు సూచించారు. ఆమెతో కార్యదర్శి నాగరాజు, నాయకులు సంగాగౌడ్, గోపాల్రావు ఉన్నారు.