చేర్యాల, సెప్టెంబర్ 29 : ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద డబ్బులు ఇప్పిస్తామని చనిపోయిన కుటుంబాలకు చెందిన వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు యువకులను చేర్యాల పోలీసులు అరెస్ట్ చేసి, గురువారం జ్యుడీషియల్ రిమాండ్కు పంపించినట్లు హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీశ్కుమార్ తెలిపారు. ఈ మేరకు చేర్యాల పోలీస్ సర్కిల్ కార్యాలయంలో విలేకరులతో ఏసీపీ వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని వడ్లం గ్రామ పరిధి మోర్సింగ్తండాకు చెందిన ఇస్లావత్ నారాయణ, కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం గుండూర్ గ్రామానికి చెందిన రాథోడ్ బాలాజీ ఈజీ మనీ సంపాదించాలని భావించారు.
గూగుల్లో సర్పంచుల ఫోన్నెంబర్లు సేకరించి, వారి ద్వారా గ్రామంలో చనిపోయిన కుటుంబాల వివరాలు తెలుసుకుంటారు. బాధిత కుటుంబాలకు ఫోన్ చేసి, తాము కలెక్టర్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని, చనిపోయిన వ్యక్తి వివరాలు చెబితే ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెబుతారు. పథకంలో డబ్బులు రావాలంటే మొదటగా కొన్ని డబ్బులు ఖర్చుల కింద అకౌంట్లో వేయాలంటారు. వారు డబ్బులు నేరుగా తమ అకౌంట్లలో వేయించుకోకుండా దగ్గరలో ఉన్న కస్టమర్ సర్వీస్ పాయింట్కు వేయించుకుంటారు. సర్వీస్ పాయింట్ నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకొని వెళ్లిపోతారు. ఈ క్రమంలో ఈ నెల 22న చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి సర్పంచ్కు ఫోన్ చేయగా, ఇద్దరి నెంబర్లు ఇచ్చారు.
వారి నుంచి రూ.45వేలు వసూలు చేశారు. తాము మోసపోయిన విషయాన్ని బాధితులు గ్రహించి, చేర్యాల పోలీసులను ఆశ్రయించారు. బుధవారం బాలాజీ చేర్యాల ఎం పీడీవో కార్యాలయానికి రాగా, పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో బాలాజీతోపాటు నారాయణను విచారించగా, 18నెలలుగా ఈ తరహా మోసాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. కొమురవెల్లి, దుబ్బాక, అందోల్ మండలాలతోపాటు మేడ్చల్, మహబూబ్నగర్ జిల్లా కురవి మండలాల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడి, రూ. లక్షా45వేలు వసూలు చేశారని ఏసీపీ తెలిపారు. నిందితులపై వివిధ ప్రాంతాల్లో 6 కేసులు నమోదయ్యాయని, వారి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేసినట్లు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు చేర్యాల సీఐ శ్రీనివాస్తోపాటు పీసీ లు వెంకట్, భాస్కర్ చేసిన కృషి అభినందనీయమన్నారు.