సంగారెడ్డి, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ పండుగ, చీరల పంపిణీపై సమావేశాన్ని నిర్వహించి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు పండుగ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొనాల న్నారు.
నిమజ్జనం చేసే ప్రాంతాల్లో లైటింగ్, శానిటేషన్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. బతుకమ్మ ఘాట్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువుల వద్ద సరైన భద్రత ఏర్పాట్లు ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,45,000 చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. చీరల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆర్డీవోలకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీపీవో సురేశ్ మోహన్, యువజన సంక్షేమ అధికారి రాంచందర్రావు, మెప్మా, డీఐసీజీఎం, రెవెన్యూ డివిజనల్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెదక్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సంసృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగను వైభవం గా జరుపుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. అక్టోబర్ 3 వరకు తీరొక రీతిన బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా రెండో రోజు సోమవారం డీఆర్డీవో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన అటుకుల బతుకమ్మలో అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మల చుట్టూ మహిళా సమాఖ్య సభ్యులు, మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడి హుషారు కలిగించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిరా, డిఆర్డీవో శ్రీనివాస్, బతుకమ్మ సమన్వయాధికారి రాజిరెడ్డి, మహిళా సమాఖ్య సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.