సంగారెడ్డి, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): వీర వనిత చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శనీయమని రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ శరత్, రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్పర్సన్ లతా విజయేందర్రెడ్డి నివాళులర్పించారు. ప్రభాకర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కవులు, కళాకారులు, పోరాట యోధుల ను గౌరవించుకుంటున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు.
పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ అని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. సాయుధ పోరాటంలో ఐలమ్మ చేసిన పోరాటం అన్ని తరాలకు స్ఫూర్తిదాయకం, చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, కుల సంఘాల నాయకులు బీరయ్య యాదవ్, కిషన్, మల్లికార్జున్, పృథ్విరాజ్, రమేశ్ గౌడ్ పాల్గొన్నారు.
మెదక్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ మహిళా చైతనం, ఆత్మగౌరవానికి ప్రతీక అని మెదక్ కలెక్టర్ హరీశ్ కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ , బీసీ అభివృద్ధి అధికారి కేశూరం, రజక సంఘ నాయకులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంఘ స్వామి, సర్పంచ్ శ్రీనివాస్, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు గంగారాం, శ్రీనివాస్, మురళి, జిల్లా రజక యువత అధ్యక్షుడు విజయ్, బీసీ వసతి గృహ సంక్షేమాధికారి నాగరాజుగౌడ్ పాల్గొన్నారు.