మెదక్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): పంటల సాగు వివరాలు పక్కాగా తెలుసుకునేందుకు చేపట్టిన సర్వే మెదక్ జిల్లాలో చివరి దశకు చేరుకున్నది. ఇప్పటికే 88.3 శాతం పూర్తయ్యింది. వ్యవసాయ అధికారులు గ్రామాల్లోని పొలాల వెంట తిరుగుతూ క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేందుకు జిల్లాలోని 21 మండలాల్లో 469 గ్రామ పంచాయతీల్లో 76 క్లస్టర్ పరిధిలో ఉన్న 76 మంది ఏఈవోలు, 21 మంది ఏవోలు పని చేస్తున్నారు. పంటల వివరాలను పొలాలకు వెళ్లి నమోదు చేసే పనిని విస్తృతంగా చేపడుతున్నారు. జిల్లాలో 3,96,514 ఎకరాలకు ఇప్పటి వరకు 3,50,436 ఎకరాల్లో సర్వే చేసి నమోదు చేశారు.
సర్వే నంబర్ల ఆధారంగా వివరాల సేకరణ
పంటల సాగు వివరాల నమోదుకు వ్యవసాయ శాఖ అధికారులు పొలంబాట పట్టారు. రైతులు ఏయే పంటలు పండిస్తున్నారో తెలుసుకుని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేందుకు జిల్లావ్యాప్తంగా వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామంలో పొలాలకు వెళ్లి సర్వే నంబర్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. వానకాలంలో ఏయే పంటలు సాగు చేస్తున్నారు. పేరు, సాగు విస్తీర్ణం, ఏ రకం పంట వేశారు.. తదితర వివరాలను సేకరిస్తున్నారు. పొరపాట్లకు తావులేకుండా సర్వే నంబర్ల ఆధారంగా పక్కాగా సర్వే చేపడుతున్నారు.
రైతు బంధు పోర్టల్లో అప్లోడ్
జిల్లాలోని 21 మండలాల్లో 76 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. గ్రామాల్లో రైతులు వానకాలం సీజన్లో సాగు చేస్తున్న పంటల వివరాల నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. పంటల సాగు వివరాలను రైతుబంధు పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. మెదక్ జిల్లావ్యాప్తంగా నెల రోజులుగా ఏఈవోలు తమకు కేటాయించిన పరిధిలో క్షేత్ర స్థాయికి వెళ్లి సర్వే చేస్తున్నారు. సర్వే వివరాలతో పాటు పంటకు సంబంధించిన ఫొటోలను సైతం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 88 శాతం పంట సర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించారు.
3,96,514 ఎకరాల్లో పంటల సాగు
జిల్లావ్యాప్తంగా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల పరిధితో పాటు తూప్రాన్ రెవెన్యూ డివిజన్లోని 21 మండలాల్లోని గ్రామాల్లో రైతులు ఇప్పటివరకు 3.48 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందు లో వరి 2.94 లక్షల ఎకరాలు, పత్తి 41వేల ఎకరాలు, మొక్కజొన్న 4,470 ఎకరాలు, కందులు 1,639 ఎకరాలు, పెసర్లు 1197 ఎకరాలు, మినుములు 1198 ఎకరాలతో పాటు ఇతర పంటలు 4,684 ఎకరాల్లో సాగు చేశారు. రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు క్లస్టర్ల వారీగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
చివరి దశలో పంటల సర్వే
పంటల సర్వేను చివరి దశలో ఉంది. ఏఈవోలు పొలాలకు వెళ్లి సర్వే చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే 88.3 శాతం పూర్తిచేశాం. గ్రా మాల్లోకి వచ్చిన అధికారులకు రైతు లు సహకరించాలి. ఈ వానకాలంలో 3.96,514 ఎకరాల్లో వివిధ పంటలు సాగగు చేయగా, 76 క్లస్టర్ల పరిధిలో 3,50,436 ఎకరాల్లో పంటల వివరాల సేకరణ పూర్తయింది.
– ఆశాకుమారి,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మెదక్