వరాలతల్లి వనదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వైభవోపేతంగా నిర్వహించే ఈ వేడుకలను గురువారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించనున్నారు.
పాపన్నపేట, సెప్టెంబర్ 25: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాదేవి అమ్మవారి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చైర్మన్ బాలాగౌడ్, ఆలయ ఈవో సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలను గురువారం మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. మొదటి రోజు గురువారం దుర్గభవానీ మూలవిరాట్తో పాటు, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గోకుల్షెడ్లో ఏర్పాటు చేయనున్న ఉత్సవ విగ్రహాన్ని సైతం శైలపుత్రి రూపంలో ముదురు పసుపు రంగు చీరలో అలంకరించనున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి భాజాభజంత్రీలు వేదమంత్రాల మధ్య ఊరేగింపుగా రాజగోపురంలోకి తీసుకెళ్లి అక్కడ ప్రతిష్టిస్తారు. పల్లకీ సేవలో ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఆలయ అధికారులు తెలిపారు.
గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభం..
ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఉత్సవాలు గణపతి పూజతో ప్రారంభంకానున్నాయి. అఖండ దీపారాధన, పుణ్యహవాచనం, రుత్వికరణ, కలశస్థాపన, దేవీచతుష్ట ఉపవాచ, సహితరాజోపచార, పూజలతో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచేకాకుండా పట్టణాల నుంచి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారు. నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్న అమ్మవారిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకోవాలని ఆలయ చైర్మన్ ఈవో విజ్ఞప్తి చేశారు.
అమ్మవారి అవతారాలు..
ఈనెల 26న శైలపుత్రి, 27న బ్రహ్మచారిని, 28న చంద్రగంట, 29న కుష్మాండ మహాలక్ష్మి, 30 స్కందమాత, అక్టోబర్1న కాత్యాయని, 2న కాలరాత్రి సరస్వతీదేవి, 3న మహాగౌరి, 4న సిద్ధిరాత్రి, 5న వనదుర్గాదేవి రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఆలయ దర్శనం పునః ప్రారంభం
ఇటీవల రెండురోజుల పాటు సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటివిడుదలతో మూసి ఉన్న ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం తెరుచుకున్నది. వరద తగ్గడంతో ఆలయం ముందు నుంచి నీటి ప్రవాహం తగ్గింది. దీంతో ఆలయ చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ఆలయ ఈవో సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయాన్ని పునఃప్రారంభించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు.