జహీరాబాద్/రాయికోడ్, సెప్టెంబర్ 22: రైతులకు మెరుగైన సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ను కొంతమంది అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఎమ్మార్వోలు తప్పుడు పత్రాలు సృష్టించి, అక్రమాలకు పాల్పడుతున్నారు. భూ రికార్డులు తారుమారు చేస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రెవెన్యూ డివిజన్లో జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో అవినీతికి పాల్పడి కొందరు రెవెన్యూ అధికారులు రైతుల భూములను తప్పుడు పత్రాలతో మార్పిడి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం న్యాల్కల్ తహసీల్దార్పై అవినీతి, ఆరోపణలు రావడంతో కలెక్టర్ శరత్ సస్పెండ్ చేశారు. భూ యజమాని బతికి ఉన్నా మృతి చెందినట్లు తప్పుడు ధ్రువ పత్రాలతో రాయికోడ్ తహసీల్దార్ భూమార్పిడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న యజమాని కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అక్రమాలు వెలుగుచూశాయి. రాయికోడ్ తహసీల్దార్ రాజయ్యపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
జహీరాబాద్ రెవెన్యూ డివిజన్లో పని చేస్తున్న అధికారుల పనితీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. భూ రిజిస్ట్రేషన్ బాధ్యతలను ప్రభుత్వం తహసీల్దార్కు అప్పగించింది. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, కార్యాలయంలోనే ఉండి రిజిస్ట్రేషన్లకు పరిమితమవుతున్నారు. భూ మార్పిడి చేసే సమయంలో వారసత్వ ధ్రువీకరణ, గ్రామస్తుల సమక్షంలో పంచనామా పత్రాలు పరిశీలించడం లేదనే ఆరోపణలున్నాయి. రాజకీయ నాయకుల ఇంటి వద్దకు వెళ్లి పంచనామా చేసినట్లు రికార్డు నమోదు చేస్తున్నారు. పట్టా పాసు పుస్తకం ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని ధరణి పోర్టల్లో నిబంధనలు ఉన్నా, వాటిని కొందరు ఎమ్మార్వోలు పట్టించుకోవడం లేదు. డబ్బులిస్తే ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. మరి కొందరు రైతుల భూములను నిషేధిత జాబితాలో ఉంచడం, డబ్బులు ఇచ్చిన వారి భూములు ఆ జాబితా నుంచి తొలిగించడం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది రైతులు నిషేధిత జాబితా నుంచి తమ భూములు తొలిగించాలని తహసీల్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టంచుకోవడం లేదు. రాయికోడ్ గ్రామంలో ఒకే సర్వే నంబర్లో ఇద్దరు వ్యక్తుల పేరిట పట్టా ఉంది. ఒక వ్యక్తి పట్టాను నిషేధిత జాబితా నుంచి తొలిగించి, మరో వ్యక్తి భూమిని ఉంచి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. గ్రామాల్లో రియల్ వ్యాపారం పెరిగిపోవడంతో డబ్బుల్లేనిదే పనులు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో భూములు అమ్మాలన్నా, కొనాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాయికోడ్ మండలంలోని నాగల్పల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల శివమ్మకు చెందిన 198 సర్వే నెంబర్లో 27 ఎకరాల భూమి ఉంది. బతికున్న ఆమె మృతి చెందినట్లు చిత్రీకరించి, యూసూఫ్పూర్ గ్రామానికి చెందిన ఒకరు రాయికోడ్లో ఆర్ఐగా పని చేసిన అధికారితో వారస్వత ధ్రువ పత్రం తీసుకున్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ధ్రువ పత్రంతో తహసీల్దార్ పట్టామార్పిడి (పౌతి పట్టా) మార్పులు చేశారు. శివమ్మ మృతి చెందినట్లు ఎమ్మార్వో రాజయ్య ధ్రువీకరించారు. ఆమె పేరిట ఉన్న భూమిని యూసుఫ్పూర్కు చెందిన శేరి అంజమ్మపై మార్చాడు. మండలంలోని ఓ రాజకీయ నాయకుడి అండతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, పౌతీ తీసినట్లు ఆరోపణలున్నాయి. తప్పుడు పత్రాలతో పట్టా మార్పిడి చేశారని బాధితురాలు రాయికోడ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విషయంలో శివమ్మ బుధవారం సంగారెడ్డి కలెక్టర్ డా.శరత్ను ఆశ్రయించింది. కలెక్టర్ సమగ్ర విచారణ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో విచారించిన, తహసీల్దార్ రాజయ్య విధుల్లో నిర్లక్ష్యం చేసినట్లు నిర్ధారించారు. ఈ నివేదికను కలెక్టర్కు పంపనున్నట్లు తెలిపారు. రాజయ్యను సస్పెండ్ చేసి, రాయికోడ్ ఇన్చార్జి తహసీల్దార్గా నయబ్ తహసీల్దార్ రాజుకు బాధ్యతలు అప్పగించారు.
రాయికోడ్ మండలం చర్లరాయిపల్లి గ్రామంలోని భూమిని తప్పుడు ధ్రువ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన ట్లు బాధితురాలు శివమ్మ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తహసీల్దార్ రాజయ్యపై చర్యలు తీసుకుంటారు. పట్టా మార్పిడిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం.
– రమేశ్బాబు, ఆర్డీవో, జహీరాబాద్
రాయికోడ్ మండలంలోని చర్లరాయిపల్లి శివారులో ఉన్న తన భూమిని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వేరే వ్యక్తుల పేరిట పట్టా మార్పిడి చేశారని బాధితురాలు శివమ్మ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశాం. రాయికోడ్ పోలీస్స్టేషన్లో తహసీల్దార్ రాజయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నాం. బాధితురాలికి న్యాయం చేసేందుకు కృషి చేస్తాం.
– రఘు, డీఎస్పీ, జహీరాబాద్
రెవెన్యూ అధికారులకు ముడుపులు అందిస్తేనే పనులు చేస్తున్నా రు. నిషేధిత జాబితాలో ఉన్న నా భూములను తీసేయాలని మీ సేవ లో దరఖాస్తు చేసుకున్నా. అధికారుల దగ్గరికి ఎన్నోసార్లు వెళ్లి, మొరపట్టుకున్నా. ముడుపులు ఇస్తేనే తొలగిస్తామన్నారు. మండలంలోని చాలామంది రైతుల పరిస్థితి ఇలానే ఉంది. సంబంధిత జిల్లా అధికారులు వెంటనే స్పందించి రైతుల ఇబ్బందులు తొలగించాలి.
– ప్రవీణ్కుమార్, పీఏసీఎస్ డైరెక్టర్, హద్నూర్