సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 22 : మెదక్ జిల్లాకు బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలతో పా టు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలకు బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరైనట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని బీసీ విద్యార్థుల కోసం జిల్లాకో రెసిడెన్షియల్ చొప్పున మరో 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 261 బీసీ గురుకుల పాఠశాలలతో కలిపి ఆ సంఖ్య 310కి చేరిందన్నారు. కొత్త పాఠశాలల్లో 7,290 మందికి, కళాశాలల్లో 3,600 మందికి కలిపి అదనంగా 11,520 మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే ఉండేవని, విద్యార్థుల వినతులను విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ఏటా కొత్త గురుకులాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు కొత్తగా మూడు రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయని తెలిపారు. సిద్దిపేటలో బాలురు, సంగారెడ్డిలో బాలు రు, మెదక్లో బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాకు బాలుర రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మంజూరైందన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్యాబోధనతో పాటు అదే తరహాలో వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా లో ఇప్పటికే 11 రెసిడెన్షియల్ పాఠశాలలు, డిగ్రీ బాలికల రెసిడెన్షియల్ ఉండగా, మరో రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేసుకున్నామన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలతో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగిందన్నారు. పేద విద్యార్థులకు విద్యా ప్రమాణాలు పెంచడంలో తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందన్నారు. మంజూరైన పాఠశాలలు ఈ సంవత్సరం నుంచి తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభిస్తామని, వీటికి పక్కా భవనాలకు వెంటనే స్థలాలు సేకరించి నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాకు బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయడంపై టీఆర్ఎస్వీ విద్యార్థి విభా గం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సిద్దిపేటలోని మంత్రి హరీశ్రావు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి శేఖర్గౌడ్, పట్టణ అధ్యక్షుడు మహిపాల్గౌడ్, జిల్లా నాయకులు ప్రశాంత్గౌడ్, నవీన్గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాకు మూడు రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు మెదక్ జిల్లాకు బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. నాడు రాష్ట్రం మొత్తం 19 రెసిడెన్షియల్లు ఉండేవని, నేడు తెలంగాణలో 300కు పైగా రెసిడెన్షియల్ స్కూల్లు తెచ్చుకున్నామని చెప్పారు. ప్రభు త్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు. చదువుకు పేదరికం అడ్డు కావొద్దని, ప్రతిఒక్కరూ చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.